Deputy Cm Pawan Kalyan news | కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో సెప్టెంబర్ 17న తెలంగాణ విమోచన దినోత్సవం నిర్వహిస్తున్న విషయం తెల్సిందే. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పందించారు.
భారతదేశం 1947 ఆగస్టు 15న స్వాతంత్ర్యం పొందినా ఆ ఫలాలు పొందటానికి తెలంగాణ ప్రజలకు మరో 13 నెలలు సమయంపట్టిందన్నారు. నిజాం నిరంకుశ పాలనపై భారత ఉక్కు మనిషి సర్ధార్ వల్లభాయ్ పటేల్ నేతృత్వంలో సాగిన పోలీస్ యాక్షన్ మూలంగా తెలంగాణకు స్వేచ్ఛ దక్కి విమోచన కలిగిందని పేర్కొన్నారు.
తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రజానీకానికి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. నిజాం ఏలుబడిలో రజాకార్లు ఊళ్ళ మీదపడి సాగించిన అకృత్యాల వల్ల ప్రజల మాన ప్రాణాలకు రక్షణ లేకుండాపోయిందని, రజాకార్లపై రైతాంగం చేసిన సాయుధ పోరాటానికి చరిత్రలో ప్రత్యేక స్థానం ఉందని తెలిపారు.
రజాకార్లు చెలరేగిన తీరు, వారికి నాయకత్వం వహించిన కాసీమ్ రజ్వీ ఢిల్లీ ఎర్రకోటపై అసఫ్ జాహీ పతాకాన్ని ఎగురవేస్తానని విర్రవీగిన విధానం… వల్లభాయ్ పటేల్ ఏ విధంగా కట్టడి చేసిందీ ఈతరానికి తెలియచేయాల్సిన అవసరం ఉందని నొక్కిచెప్పారు.
నిజాం పాలనపై రైతులు, సామాన్య ప్రజలు చేసిన పోరాటం తాలూకు స్ఫూర్తి నేటి తరంలోనూ ఉందన్నారు. తెలంగాణ ప్రాంతం అభివృద్ధిలో మరింత ముందుకు వెళ్లాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నట్లు పవన్ కళ్యాణ్ ఒక ప్రకటనలో తెలిపారు.










