Delhi High Court Comments on Extramarital Affairs | వివాహేతర సంబంధంపై ఢిల్లీ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. వివాహేతర సంబంధాన్ని నేరంగా చూడాల్సిన అవసరం లేదని, అది నైతికతకు సంబంధించిన అంశమని పేర్కొంది. ఇదే విషయంపై గతంలో సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలను ఉంటంకించింది. ఓ కేసులో ఓ వ్యక్తి భార్య, ఆమె ప్రియుడికి ఢిల్లీ హైకోర్టు విముక్తి కలిగించింది.
వివరాల్లోకి వెళితే తన భార్య మరో వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుందని, ఓ హోటల్లో వారిద్దరూ శారీరకంగా కలుస్తున్నారని ఆరోపిస్తూ ఓ మహిళ భర్త కోర్టుకెక్కాడు. ఈ కేసులో మేజిస్ట్రేట్ కోర్టు ప్రియుడిని విడిచిపెట్టింది. దీంతో ఆ బాధిత భర్త సెషన్స్ కోర్టును ఆశ్రయించాడు. వాదనలు విన్న కోర్టు ప్రియుడికి సమన్లు పంపింది. అయితే అతడు సెషన్స్ కోర్టు సమన్లపై ఢిల్లీ హైకోర్టులో సవాలు చేశాడు.
అక్కడ అతడికి అనుకూలంగా తీర్పు వచ్చింది. భార్యను భర్త ఆస్తిగా పరిగణించే మహాభారత కాలం నాటి భావజాలానికి కాలం చెల్లిందని పేర్కొంది. వివాహేతర సంబంధం నేరమంటూ ఐపీసీ 497 సెక్షన్ ఇచ్చిన నిర్వచనం రాజ్యాంగబద్ధం కాదని సుప్రీంకోర్టు గతంలో ఇచ్చిన తీర్పును ఈ సందర్భంగా ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ నీనా బన్సల్ కృష్ణ ఉటంకించారు. వివాహేతర సంబంధం నైతికతకు సంబంధించిన అంశమని, దానిని నేరంగా చూడటం సరికాదని స్పష్టం చేస్తూ భార్య ప్రియుడికి ఈ కేసు నుంచి విముక్తి కల్పించారు.