CP Sajjanar Warning To Social Media Influencers | ప్రస్తుతం ఓ నయా ట్రెండ్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. లక్కీ డ్రాలో కార్లు, బైకులు, నగదు గెలుచుకోవచ్చు అంటూ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు ప్రకటనలు చేస్తూ భారీగా డబ్బులు వసూలు చేస్తున్నారు. ఇలా మోసాలకు పాల్పడుతున్న వాటికి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు హైదరాబాద్ సీపీ వీసీ సజ్జనర్. రీల్స్లో బిల్డప్ ఇస్తూ రియాలిటీలో మాత్రం ఫ్రాడ్ చేస్తున్నారని పేర్కొన్నారు. లక్కీ డ్రా ఇన్ఫ్లుయెన్సర్ల పట్ల జాగ్రత్తగా ఉండాలని అప్రమత్తం చేశారు. సోషల్ మీడియాలో కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్లు కార్లు, బైకులు, ప్లాట్లు, డీజేలు ఇస్తామంటూ లక్కీ డ్రాల పేరుతో మోసాలు చేస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు.
బెట్టింగ్ యాప్ ల ప్రమోషన్ల దందా బంద్ కావడంతో లక్కీ డ్రాలు అంటూ కొత్త వేషాలతో వీళ్ళు దర్శనమిస్తున్నారని మండిపడ్డారు. అమాయకపు ప్రజల ఆశను ఆసరాగా చేసుకుని నిండా ముంచుతున్న ఇన్ఫ్లూయెన్సర్లపై చట్టప్రకారం చర్యలు ఉంటాయని తెలిపారు. ది ప్రైజ్ చిట్స్ సర్కులేషన్ స్కీంస్ (బ్యానింగ్) చట్టం-1978 ప్రకారం కేసులు నమోదు చేయనున్నట్లు వివరించారు. మోసాలకు పాల్పడే వారు సెలబ్రిటీలైనా, సోషల్ మీడియా స్టార్లైనా సరే.. ఎవరినీ ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు. పాపులారిటీని అడ్డం పెట్టుకుని ప్రజలను దోచుకుంటే కఠిన చర్యలు తప్పవని హెచ్చరికలు జారీ చేశారు.










