Jagga Reddy Comments | తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో కొత్త ఆశలు చిగురిస్తున్నాయి. మొన్నటి వరకు వెనకబడిన పార్టీ తాజాగా పలువురు కీలక నేతలు చేరుతుండటంతో కొత్త జోష్ వచ్చింది.
అయితే వర్గపోరు, అంతర్గత కుమ్ములాటకు పెట్టింది పేరైన కాంగ్రెస్ పార్టీలో మళ్లీ లొల్లి షురూ అయ్యింది.
ఓవైపు పలువురు కీలక నేతలు పార్టీలో చేరుతుంటే, మరోవైపు ముఖ్య నేతలు పార్టీని వీడుతున్నారనే పుకార్లు చక్కర్లు కొడుతున్నాయి.
ఏకంగా టీపీసీపీ మాజీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి (Uttam Kumar Reddy), మాజీ మంత్రి జానా రెడ్డి (Jana Reddy), ఎమ్మెల్యే జగ్గారెడ్డి లాంటి సీనియర్లపై కూడా బీఆరెస్ లో చేరుతున్నారనే వార్తలు పుట్టుకొస్తున్నాయి.
ఈ తరుణంలో తెలంగాణ కాంగ్రెస్ లో ప్రతిపక్ష పార్టీలకంటే సొంత పార్టీ నాయకులపైనే తరచూ విమర్శలు చేస్తూ వార్తల్లో నిలిచే జగ్గారెడ్డి (Jagga Reddy) తాజాగా మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు.
Read Also: మహారాష్ట్రలో కేసీఆర్ పర్యటన.. శివసేన ఆసక్తికర వ్యాఖ్యలు!
హస్తం పార్టీని వదిలి బీఆరెస్ లో చేరుతున్నారంటూ ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో స్పందించిన ఆయన తన ఆవేదనను వ్యక్తం చేశారు.
కాంగ్రెస్ పార్టీలో ఏం దరిద్రమోగానీ అనుక్షణం శీలపరీక్ష ఎదుర్కోవాల్సి వస్తోందని వ్యాఖ్యానించారు. పార్టీ మార్పు గురించి తనపై జరుగుతున్న దుష్ప్రచారం చాలా ఆవేదన కలిగిస్తోందని వాపోయారు.
ఇంత బతుకు బతికి కాంగ్రెస్లో ఇలాంటి పరిస్థితి చూస్తా అనుకోలేదన్నారు. రాష్ట్ర కాంగ్రెస్ (Telangana Congress) నేతల పరిస్థితిని హైకమాండ్ కళ్లకుకడతానంటూ జగ్గారెడ్డి వ్యాఖ్యానించారు.
AICC సమావేశంలో పాల్గొనేందుకు ఢిల్లీ వెళ్లిన ఆయన మీడియా ముందు చెప్పలేని చాలా విషయాలు తాను రాహుల్ గాంధీకి తెలియజేస్తానన్నారు.
తాను ఏ విషయమైన అందరి ముందే చెప్తానని, ఎవరికీ భయపడనని చెప్పారు. పదవుల కోసం లాలూచీ పడే వ్యక్తిని కానని జగ్గారెడ్డి వ్యాఖ్యానించారు.
మరికొన్ని నెలల్లో జరిగే అసెంబ్లీ ఎన్నికలే టార్గెట్ గా రాహుల్ గాంధీ (Rahul Gandhi), మల్లికార్జున ఖర్గే (Mallikarjuna Kharge) తెలంగాణ కాంగ్రెస్ నేతలతో భేటీ కానున్నారు.
ఈ సమావేశానికి ముందు జగ్గారెడ్డి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. మీటింగ్ తర్వాత పార్టీలో కీలక మార్పలు చోటు చేసుకోనున్నాయనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి.










