CM Revanth Reddy | తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం (Telangana Formation Day) సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్లో నిర్వహించిన తెలంగాణ ఆవిర్భావ వేడుకల్లో పాల్గొని జాతీయ పతకాన్ని ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రజల ఆకాంక్షలు నెరవేర్చడమే తమ అజెండా అని తెలిపారు.
తాము బాధ్యతలు చేపట్టేనాటికి ఆర్థిక వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉందని చెప్పారు. పదేళ్లపాటు నిర్లక్ష్యానికి గురైన వ్యవస్థలను చక్కదిద్దుతున్నామన్నారు. రాష్ట్రంలో కోటిమంది మహిళలను కోటీశ్వరులుగా మార్చాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు వెల్లడించారు. రైతు సంక్షేమమే ధ్యేయంగా రూ. 2లక్షలలోపు రుణాలను మాఫీ చేశామన్నారు. సన్నవడ్లు పండించిన రైతులకు క్వింటాల్కు రూ.500 బోనస్ ఇస్తున్నామని తెలిపారు. ఉద్యోగ నియామకాల్లో దేశంలోనే తెలంగాణ అగ్రస్థానంలో ఉందన్నారు.
విద్యార్థుల్లో నైపుణ్యాలు పెంచేందుకు యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు చేసినట్లు వివరించారు. ప్రతి నియోజకవర్గంలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ నిర్మిస్తున్నామన్నారు. తమ ప్రభుత్వం రాగానే విద్య, వైద్య రంగాన్ని ప్రక్షాళన చేశామన్నారు.
ఉస్మానియా ఆసుపత్రికి పూర్వవైభవం తీసుకొస్తామని తెలిపారు. రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం పరిమితిని రూ.10లక్షలకు పెంచామని చెప్పారు. వందేళ్లలో జరగని కులగణనను తెలంగాణ ప్రభుత్వం చేపట్టిందని తెలిపారు.