CM Revanth Satires On KCR | భారత రాష్ట్ర సమితి (BRS) అధ్యక్షుడు కేసీఆర్ (KCR) మరియు ఆ పార్టీ నేతలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy) తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. తమను తాము “తెలంగాణ జాతిపిత”, “ఉద్యమకారులు” అని చెప్పుకోవడం సరికాదని ఆయన స్పష్టం చేశారు.
పోలీసులు చిన్న నోటీసులు ఇస్తేనే “జాతిపితకు నోటీసులు ఇస్తారా?” అంటూ బీఆరెస్ నేతలు ఆందోళన వ్యక్తం చేయడం అర్థరహితమని రేవంత్ రెడ్డి అన్నారు. “జాతిపిత గాంధీజీ తన పదవులన్నింటినీ త్యాగం చేసి, దేశం కోసం ప్రాణాలు అర్పించారు. మరి ఇప్పుడు జాతిపితమని చెప్పుకుంటున్న వారు తెలంగాణ కోసం ఏమి త్యాగం చేశారు?” అని ప్రశ్నించారు.
తెలంగాణ ఉద్యమాన్ని ఏకం చేసి ముందుకు నడిపించిన ప్రొఫెసర్ కోదండరాం (Professor Kodanda Ram) నిజమైన ఉద్యమకారుడని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.
“మీ పాలనలోనే ఆయన ఇంటి తలుపులు బద్దలు కొట్టి అరెస్టు చేశారు. అప్పుడే ఉద్యమకారులు గుర్తుకు రాలేదా?” అని విమర్శించారు. పోలీసుల విచారణలో తాము తలుపులు బద్దలు కొట్టి తీసుకురాలేదని, నోటీసులు ఇచ్చి పిలిచారని ఆయన గుర్తుచేశారు.
తెలంగాణ కోసం రావి నారాయణ రెడ్డి వంటి నాయకులు సర్వం కోల్పోయారని, కానీ కొందరు మాత్రం పదవులు పొంది వేల కోట్ల ఆస్తులు సంపాదించారని విమర్శించారు. “ఇలా సంపద కూడబెట్టిన వారు ఉద్యమకారులు ఎలా అవుతారు?” అని ప్రశ్నించారు.
ప్రజలు ఎన్నికల్లో తిరస్కరించిన విషయాన్ని అంగీకరించాల్సిన అవసరం ఉందని, తప్పు జరిగితే హుందాగా ఒప్పుకోవడమే గౌరవాన్ని నిలబెడుతుందని సీఎం అన్నారు. ప్రజలే తప్పు చేశారంటూ మాట్లాడడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమని వ్యాఖ్యానించారు.
అంబేద్కర్ వ్యాఖ్యలను ఉదహరిస్తూ, “అక్రమ మార్గం ఎంచుకున్న వారు ప్రజాస్వామ్యంలో తప్పకుండా విచారణను ఎదుర్కోవాల్సిందే” అని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. శిబు సోరెన్ వంటి నేతలు కూడా విచారణను ఎదుర్కొన్నారని గుర్తు చేశారు.
“మనమేమీ దైవాంశ సంభూతులం కాదు. మధ్యయుగాల చక్రవర్తుల కాలం పోయింది. ప్రజాస్వామ్యంలో తప్పు చేసినవారు తప్పకుండా జవాబుదారీగా నిలబడాలి” అని ఆయన వ్యాఖ్యానించారు.










