Cm Revanth Reddy News | జమ్ము కశ్మీర్లోని పహల్గామ్లో ఉగ్రవాదుల దాడిలో ప్రాణాలు కోల్పోయిన పర్యాటకుల ఆత్మలకు శాంతి చేకూరాలని ఆకాంక్షిస్తూ తెలంగాణ ప్రభుత్వం శుక్రవారం రాత్రి సంఘీభావ ర్యాలీ నిర్వహించింది. ఇందులో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్నారు.
ఉగ్రదాడిలో చనిపోయినవారికి ఆత్మశాంతి చేకూరాలని ప్రార్థిస్తూ నివాళులు అర్పించారు. హైదరాబాద్ లోని పీవీ మార్గ్ నెక్లెస్ రోడ్డులోని పీపుల్స్ ప్లాజా నుంచి ఇందిరా గాంధీ విగ్రహం వరకు సాగిన కొవ్వొత్తుల ర్యాలీలో ముఖ్యమంత్రితో పాటు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, భారత సమ్మిట్ 2025లో పాల్గొనడానికి వచ్చిన వివిధ దేశాల ప్రతినిధులు, ఇతర ప్రజాప్రతినిధులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
సంఘీభావ ర్యాలీని ఉద్దేశించి ముఖ్యమంత్రి మాట్లాడుతూ, పహల్గామ్లో అమాయకుల ప్రాణాలను తీసిన ఉగ్రవాదుల చర్యలను తీవ్రంగా ఖండించారు. ఈ ఘటనకు బాధ్యులైనవారిపై కఠినంగా చర్యలు తీసుకునే విషయంలో యావత్ దేశం కేంద్ర ప్రభుత్వానికి అండగా నిలుస్తుందని స్పష్టం చేశారు.
ఈ భావోద్వేగ సమయంలో 140 కోట్ల మంది భారత ప్రజలంతా ఒక్కటిగా నిలబడాలని దేశ సార్వభౌమత్వాన్ని కాపాడుకోవాలని పిలుపునిచ్చారు. ఇది రాజకీయాలకు అతీతంగా ఐకమత్యం చాటుకోవాల్సిన సందర్భమన్నారు. దాడికి బాధ్యులైన వారిని ఉపేక్షించకూడదని, ఇలాంటి దాడులు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు.
ఈ విషయంలో భారత ప్రభుత్వానికి సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్నామని చెప్పారు. 1967లో చైనాపై, 1971లో పాకిస్తాన్పై నాటి ప్రధాని ఇందిరా గాంధీ నాయకత్వంలో దేశం చూపిన తెగువను గుర్తు చేస్తున్నట్లు తెలిపారు.
ఇందిరా గాంధీ స్ఫూర్తితో ఉగ్రవాదులకు గట్టిగా బుద్ధి చెప్పాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి విజ్ఞప్తి చేశారు. పాక్ ఆక్రమిత కాశ్మీర్ను భారత్లో కలపే విశయంలోనూ ప్రధానమంత్రికి మద్దతు ఇస్తామని, అలాగే, ఉగ్రదాడి బాధిత కుటుంబాలకు అండగా నిలుస్తామని ముఖ్యమంత్రి రేవంత్ భరోసా ఇచ్చారు.