Cm Revanth On UBL Over Beer Rates | తెలంగాణలో 2019-20 ఆర్ధిక సంవత్సరం నుండి బీర్ల ధరలు పెంచలేదని పెరిగిన ఉత్పత్తి వ్యయానికి తగ్గట్లుగా ధరలు పెంచకపోవడం మూలంగా రాష్ట్రానికి సరఫరా నిలిపివేస్తున్నట్లు యూబీఎల్ వెల్లడించిన విషయం తెల్సిందే.
ఈ క్రమంలో ఇటీవల యునైటెడ్ బేవరేజస్ కంపెనీ బీర్ల రేట్లను 33.1 శాతం పెంచాలని ఒత్తిడి చేసిన విషయాన్ని అధికారులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకొచ్చారు.
కంపెనీల ఒత్తిడికి తలొగ్గేది లేదని, పొరుగున ఉన్న ఏపీ, మహారాష్ట్రతో పాటు ఇతర రాష్ట్రాల్లో ఉన్న బీర్ల ధరలను పరిశీలించాలని ముఖ్యమంత్రి అధికారులకు సూచించారు. ఇప్పటికే తెలంగాణ బివరేజెస్ కార్పొరేషన్ కు సరఫరా చేస్తున్న కంపెనీలు కొత్త బ్రాండ్లు సరఫరా చేసేందుకు సులభతర వాణిజ్య విధానం అనుసరించాలన్నారు.
ఏడాదిగా ఎక్సైజ్ శాఖ ఎప్పటికప్పుడు బిల్లులు చెల్లిస్తుండగా, గత ప్రభుత్వం పెట్టిన బకాయిలను క్రమంగా క్లియర్ చేయాలని సీఎం ఆర్ధిక శాఖ అధికారులను ఆదేశించారు. ఈ మేరకు ఎక్సైజ్ శాఖపై ముఖ్యమంత్రి సమీక్ష చేశారు.