Cm Chandrababu Birthday News | పుట్టినరోజున అభిమానులు, నాయకులు అందించిన శుభాకాంక్షలు, చూపించిన అభిమానం, ఆప్యాయతతో తన మనసు ఉప్పొంగిందన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు.
ఇప్పటివరకు సాగిన ప్రయాణంలో తనకు తోడుగా నిలిచిన అందరికీ కృతజ్ఞతలు చెప్పారు. 75 ఏళ్ల జీవన ప్రయాణంలో, 47 ఏళ్ల రాజకీయ ప్రస్థానంలో ఎల్లప్పుడూ తోడునీడగా ఉండి,తనను ముందుకు నడిపించిన ప్రతి ఒక్కరికీ ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలిపారు.
ప్రజాసేవ చేసేందుకు నాలుగోసారి ముఖ్యమంత్రిగా అవకాశమిచ్చిన తెలుగు ప్రజలకు ఎప్పటికీ రుణపడి ఉంటానన్నారు. ఇది ఎవరికీ దక్కని అరుదైన గౌరవం… అపురూప అవకాశమని సంతోషం వ్యక్తం చేశారు. తెలుగు సమాజ పురోగతి కోసం అలుపులేకుండా పనిచేసేలా మీరంతా ఉత్సాహం నింపారని, ప్రజల భవిష్యత్ కలలు, ఆకాంక్షలను సాకారం చేయాడానికి నిరంతరం కష్టపడి పనిచేస్తానని మాటిచ్చారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాభివృద్ధి కోసం, తెలుగు ప్రజల అభ్యున్నతి కోసం పునరంకితమవుతానని జన్మదినం రోజున వినమ్రంగా తెలియజేస్తున్నట్లు చంద్రబాబు పేర్కొన్నారు. సమాజంలో అసమానతలు పోవాలి, పేద-ధనిక వర్గాల మధ్య అంతరాలు తగ్గాలి., పేదరికం లేని సమాజం స్థాపించాలనేదే తన సంకల్పమని స్పష్టం చేశారు.
అందుకే పీ4 కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్లు తెలిపారు. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా తెలుగు ప్రజలు సాధిస్తున్న విజయాలు మనకెంతో గర్వకారణంగా నిలుస్తున్నాయన్నారు. అత్యధిక తలసరి ఆదాయం ఆర్జిస్తున్నవారిలో ముందువరుసన తెలుగువారు ఉండడం సంతోషంగా ఉందన్నారు. 2047 నాటికి ప్రపంచంలోనే శక్తివంతమైన జాతిగా తెలుగు జాతిని నిలపాలన్నదే తన అభిలాష అని వెల్లడించారు.