Changes In AP Intermediate Examinations | ఇంటర్ విద్యకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక సంస్కరణలకు సిద్ధం అవుతుంది.
ఇంటర్ ఫస్ట్ ఇయర్ పరీక్షలను తొలగిస్తామని ఇంటర్ బోర్డ్ కార్యదర్శి కృతికా శుక్ల తెలిపారు. ఈ మేరకు ఆమె బుధవారం మీడియా సమావేశం నిర్వహించారు. చాలా ఏళ్లుగా ఇంటర్ విద్యలో సంస్కరణలు జరగలేదన్నారు.
2024-25 నుంచి పదో తరగతిలో NCERT పాఠ్యపుస్తకాలు ప్రవేశపెట్టినట్లు, 2025-26లో ఇంటర్ ఫస్ట్ ఇయర్ లో NCERT సిలబస్ ను ప్రవేశపెట్టనున్నట్లు కృతికా శుక్ల స్పష్టం చేశారు. పరీక్షల మార్కుల కేటాయింపులో కూడా రిఫార్మ్స్ తీసుకురానున్నట్లు చెప్పారు.
ఇందులో భాగంగానే ఫస్ట్ ఇయర్ పరీక్షలను తొలగించనున్నట్లు పేర్కొన్నారు. ఇంటర్ కాలేజీలు అంతర్గతంగా ఫస్ట్ ఇయర్ పరీక్షలను నిర్వహిస్తాయి, బోర్డు కేవలం సెకండ్ ఇయర్ పరీక్షలను నిర్వహిస్తుందన్నారు.
జనవరి 26 లోగా ఇంటర్ విద్యలో సంస్కరణలపై తల్లిదండ్రులు, విద్యార్థులు మరియు విద్యావేత్తల నుండి సలహాలు, సూచనలు స్వీకరించనున్నట్లు వెల్లడించారు.