Telangana Jagruthi New Office | బీఆరెస్ పార్టీ అధినేత కేసీఆర్(KCR) కు లేఖ రాసి తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారిన ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత (Kalvakuntla Kavitha) శనివారం కవిత కొత్త కార్యాలయంలోకి అడుగుపెట్టారు.
బంజారాహిల్స్ లోని తన నివాసానికి సమీపంలోనే తెలంగాణ జాగృతి కొత్త ఆఫీసును శనివారం సాయంత్రం 4గంటలకు కవిత తన భర్తతో కలిసి పూజా కార్యక్రమాలతో ప్రారంభించారు. ఆ ఆఫీసులోపల తెలంగాణ సిద్ధాంత కర్త ప్రొఫెసర్ జయశంకర్, బీఆరెస్ ఆధినేత కేసీఆర్, కవిత, ఫోటోలు మినహా కీలక నేతల ఫొటోలు ఎవరివీ కనిపిచండం లేదు. అలాగే తెలంగాణ జాగృతి పేరుతో ఏర్పాటు చేసిన బ్యానర్ లో కూడా కేసీఆర్, జయశంకర్ ఫోటోలు తప్ప మిగతా వారి ఫోటోలు ప్రచురించలేదు.
ఉద్యమంలో భాగస్వామి..
కార్యాలయం ప్రారంభించిన తర్వాత ఆమె మీడియాతో మాట్లాడుతూ 18 ఏళ్ల క్రితం స్థాపించిన తెలంగాణ జాగృతి ఉద్యమంలో భాగస్వామిగా ఉందని గుర్తు చేశారు. తెలంగాణ గొంతుకలా.. తలలో నాలుకలా జాగృతి నిలిచిందన్నారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం ప్రతి ఇంట్లో ఆడబిడ్డలానే తాను కూడా బోనం, బతుకమ్మను ఎత్తానన్నారు.
బీఆరెస్ అధినేత కేసీఆర్, తెలంగాణ సిద్ధాంత కర్త జయశంకర్ స్ఫూర్తితో ఈ తెలంగాణ జాగృతి పుట్టిందన్నారు. ఇక నుంచి బంజారాహిల్స్ కొత్త కార్యాలయం నుంచే జాగృతి కార్యకలాపాలు ఉంటాయని అన్నారు. సాంస్కృతిక రంగంలో జాగృతి ఎంతో కృషి చేసిందనీ, జాగృతి డిమాండ్లను కేసీఆర్ ఎప్పుడూ గౌరవించారని తెలిపారు. ఎప్పుడు ఏం అడిగినా వెంటనే జీవో ఇచ్చేవారన్నారు.
ఆ స్కీంకు రాజీవ్ గాంధీ పేరెందుకు..
తెలంగాణ ఉద్యమంలో ఏనాడు పాల్గొనని రేవంత్ రెడ్డి ఇప్పటికైనా జై తెలంగాణ అని నినదించాలని హితవు పలికారు. ఉద్యమకారులపై గన్ తీసుకెళ్లిన వాళ్లు రాష్ట్రానికి సీఎం అయ్యారని ఫైర్ అయ్యారు. యువ వికాసం పథకానికి రాజీవ్ గాంధీ పేరు ఎందుకు పెట్టారో చెప్పాలని ప్రశ్నించారు. అసలు తెలంగాణకు రాజీవ్ గాంధీ సంబంధం ఏంటని.. ఆ పథకానికి అమరవీరుల పేర్లు పెట్టాలని కవిత సూచించారు. అవతరణ దినోత్సవం నాడు అమరవీరులకు నివాళులర్పించాలని కనీసం జ్ఞానం లేని వారికి ఆ సీఎం కుర్చీలో కూర్చునే అర్హత లేదుని మండిపడ్డారు.