BRS MLA Maganti Gopinath | జూబ్లీహిల్స్ శాసన సభ్యులు, బీఆరెస్ పార్టీ నాయకులు మాగంటి గోపీనాథ్ కన్నుమూశారు. ఆదివారం ఉదయం గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఉదయం 5 గంటల 45 నిమిషాలకు తుదిశ్వాస విడిచారు.
ఈ విషయాన్ని వైద్యులు వెల్లడించారు. జూన్ 5వ తారీఖున గోపీనాథ్ ఇంట్లో ఉన్న సమయంలో ఆయనకు గుండె పోటు వచ్చింది. దింతో కుటుంబ సభ్యులు ఆయన్ను ఏఐజీ ఆసుపత్రిలో చేర్పించారు. సీపీఆర్ చేయడంతో తిరిగి గుండె కొట్టుకోవడం మొదలైంది. ఆ తర్వాత ఐసియూలో వెంటిలేటర్ పై చికిత్స కొనసాగించారు.
గత కొంతకాలంగా గోపీనాథ్ (BRS MLA Maganti Gopinath) కిడ్నీ సమస్యలతో కూడా బాధపడుతున్నారు. మాగంటి గోపీనాథ్ 1982లో తెలుగుదేశం పార్టీలో చేరారు. 1985లో హైదరాబాద్ నగర తెలుగు యువత అధ్యక్షుడిగా ఎంపికయ్యారు.
ఈ సమయంలో దివంగత ముఖ్యమంత్రి ఎన్టీఆర్ గోపీనాథ్ కు స్వయంగా నియామక పత్రాన్ని అందజేశారు. 2014లో జూబ్లీహిల్స్ అసెంబ్లీ స్థానం నుండి టీడీపీ తరఫున పోటీ చేసి తొలిసారి ఎమ్మెల్యే గా గెలుపొందారు.
అనంతరం 2018లో టీఆరెస్ లో చేరారు. 2018, 2023 ఎన్నికల్లో జూబ్లీహిల్స్ స్థానం నుండి వరుసగా గెలిచి శాసనసభలో అడుగుపెట్టారు. మాగంటి మృతి పట్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. కాగా మాగంటి గోపీనాథ్ నివాసానికి చేరుకున్న మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావు నివాళులర్పించారు.