NV Subhash | విశ్వ నగరంలో మ్యాన్ హోళ్లు పిల్లల ప్రాణాలను మింగడమేనా కేసీఆర్, కేటీఆర్ లు చెబుతున్న తెలంగాణ మోడల్ అని ప్రశ్నించారు బీజేపీ తెలంగాణ అధికార ప్రతినిధి ఎన్వీ సుభాష్.
ఈ మేరకు మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు. నగరంలో వీధి కుక్కల బారిన పడి, పిల్లలు ప్రాణాలు కోల్పోతుంటే కంటి తుడుపు చర్యలతో సరిపెట్టేసుకుంటారా?
మొన్న మ్యాన్ హోల్ లో పడి కళాసిగూడలో మౌనిక, నేడు జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 45 లో మరో బాలుడు(6 ఏళ్ల వివేక్) మరణించినా… ఈ ప్రభుత్వానికి కనిపించడం లేదా? అని నిలదీశారు.
“చిన్నపాటి వర్షం పడితే చాలు హైదరాబాద్ మునిగిపోతోంది. లోతట్టు ప్రాంతాల ప్రజల కష్టాలు వర్ణనాతీతం. చుక్క వర్షం పడితే చాలు… నగరంలో కార్లు, బైకులు కొట్టుకుపోతున్న దృశ్యాలు నిత్యకృత్యం. హైదరాబాద్ ను డల్లాస్, ఇస్తాంబుల్ లా చేస్తామన్న కేసీఆర్ హామీ ఏమైంది?
డల్లాస్, ఇస్తాంబుల్ సంగతి దేవుడెరుగు, ముందు భాగ్యనగర వాసులకు భరోసా కల్పించి, లోతట్టు ప్రాంతాల ప్రజలను ఆదుకోవాలని డిమాండ్ చేస్తున్నా.
మీ ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగానే గోడకూలి, మ్యాన్ హోళ్లలో పడి పలువురి మరణాలు సంభవించాయి. వారి మరణానికి నైతిక బాధ్యత వహించి, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని బిజెపి డిమాండ్ చేస్తోంది.
పన్నుల రూపంలో ఒక్క హైదరాబాద్ మహానగరం నుండే 3000 కోట్ల రూపాయలను వసూలు చేస్తున్న కేసీఆర్ సర్కార్, అందుకు అనుగుణంగా మౌలిక వసతులను ఎందుకు కల్పించడం లేదని ప్రశ్నిస్తున్నా?
గ్రేటర్ ప్రజలారా…! వర్షాకాలం వస్తోంది… మొద్దు నిద్రపోతున్న కేసీఆర్ ప్రభుత్వం ఎలాను పట్టించుకోదు. మీ ప్రాణాలు మీరే కాపాడుకోండి. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ కు ప్రజలే బుద్ధి చెబుతారు… బిజెపిని గద్దెనెక్కిస్తారు.” అని తన ప్రకటనలో పేర్కొన్నారు ఎన్ వీ సుభాష్.