Andhra Pradesh achieves second-highest growth rate in India | రాష్ట్రాల వృద్ధి రేటుకు సంబంధించిన నివేదికను సెంట్రల్ మినిస్ట్రీస్ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రాం ఇంప్లిమెంటేషన్ విడుదల చేసింది. ఈ జాబితాలో 2024-25 సంవత్సరానికి గాను వృద్ధిరేటు మెరుగ్గా ఉన్న రాష్ట్రాల్లో ఏపీ రెండవ స్థానంలో నిలిచింది.
ఈ క్రమంలో సీఎం చంద్రబాబు హర్షం వ్యక్తం చేశారు. స్థిర ధరల్లో 8.21 శాతం వృద్ధి రేటుతో ఏపీ రెండవ స్థానంలో నిలవగా, 9.69 శాతంలో తమిళనాడు తొలిస్థానం లో నిలిచింది. ఇకపోతే అస్సాం మూడవ స్థానంలో నిలిచింది. ఏడాది కాలంలో 2.02 శాతంగా ఏపీ వృద్ధి రేటు పెరిగినట్లు నివేదిక వెల్లడించింది.
ప్రస్తుత ధరల విభాగంలో ఏపీ 12.02 శాతంగా ఉంది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు సంతోషం వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ ఈజ్ రైజింగ్ అంటూ ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన ఒక సంవత్సరం కంటే తక్కువ సమయంలోనే, ప్రభుత్వ విధానాలు ఆంధ్రప్రదేశ్ను ఒక దుర్భర స్థితి నుండి వృద్ధి సాధించిన రాష్ట్రంగా మార్చాయన్నారు.
ఈ పురోగతి వ్యవసాయం, తయారీ, మరియు సేవల రంగాలలో విస్తృతమైన పునరుజ్జీవనంతో పాటు ఐటీ, ఎలక్ట్రానిక్స్, ఆటోమొబైల్స్, మరియు పునరుత్పాదక ఇంధన రంగాలలో గణనీయమైన పెట్టుబడుల ద్వారా సాధించబడిందని పేర్కొన్నారు. ఇది రాష్ట్ర ప్రజల సమిష్టి విజయమన్నారు. అందరం కలిసి ఒక ఉజ్వల భవిష్యత్తును నిర్మిద్దామని సీఎం చంద్రబాబు పిలుపునిచ్చారు.