Air India Plane Crash | గుజరాత్ లో ఘోర విమాన ప్రమాదం (Gujarat Plane Crash) చోటు చేసుకుంది. గురువారం మధ్యాహ్నం అహ్మదాబాద్ విమానాశ్రయం సమీపంలోని మేఘాని నగర్ (Meghani Nagar) ప్రాంతంలో ఎయిర్ ఇండియా (Air India Plane) విమానం కుప్పకూలిపోయింది. ఆ సమయంలో విమానంలో 242 మంది ప్రయాణీకులు ఉన్నారు. విమానం కూలిన ప్రాంతంలో ఆకాశంలో దట్టమైన నల్లటి పొగ అలుముకుంది.
ఎయిర్ ఇండియా విమానం—AI171—అహ్మదాబాద్ నుండి లండన్లోని గాట్విక్కు వెళుతోంది. మధ్యాహ్నం 1.38 గంటలకు టేకాఫ్ అయిన ఐదు నిమిషాల్లోనే కూలిపోయినట్లు అధికారులు తెలిపారు. ఈ ప్రమాదం కారణంగా భారీగా ఎగిసిపడుతోన్న మంటలను ఫైర్ ఇంజిన్ల సాయంతో అదుపుచేస్తున్నారు. పదుల సంఖ్యలో అంబులెన్స్ లు అక్కడకు చేరుకున్నాయి.
ప్రమాదంలో ప్రయాణికులు ఎంతమంది గాయపడ్డారు? అనేది ఇంకా తెలియరాలేదు. ఈ ప్రమాదానికి సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
విమాన ప్రమాదం గురించి కేంద్ర హోంమంత్రి అమిత్ షా గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్, రాష్ట్ర హోంమంత్రి మరియు పోలీసు కమిషనర్తో మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం నుండి సహాయం అందిస్తామని ఆయన హామీ ఇచ్చారు. ఈ సంఘటన తర్వాత, అహ్మదాబాద్ విమానాశ్రయాన్ని తాత్కాలికంగా మూసివేశారు.