Mallikharjuna Kharge | ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (PM Narendra Modi) పై సంచలన ఆరోపణలు చేశారు కాంగ్రెస్ జాతీయ అధ్యక్షులు మల్లిఖార్జున ఖర్గే. అమెరికాలో అదాని పై కేసు, ఎప్స్టీన్ ఫైల్స్ మూలంగా అమెరికా ఎదుట మోదీ లొంగిపోయారని ఆరోపించారు.
ఈ మేరకు ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు. భారతదేశ వ్యూహాత్మక స్వాతంత్ర్యం మరియు జాతీయ సార్వభౌమత్వం ప్రమాదంలో పడిందని, నరేంద్ర మోదీపై ఎప్స్టీన్ ఫైల్స్ మరియు అదానీ కేసులను అడ్డుపెట్టుకుని అమెరికా బ్లాక్మెయిల్ చేస్తోందని పేర్కొన్నారు.
భారత్, రష్యా నుంచి చమురు కొనుగోలుకు ‘అనుమతి’ ఇస్తూ కేవలం 30 రోజుల తాత్కాలిక ఉపశమనం కల్పిస్తూ అమెరికా చేసిన ప్రకటనను ఖర్గే ప్రస్తావించారు. భారత్ గ్లోబల్ ఆర్డర్లో బాధ్యతాయుతమైన, సమాన భాగస్వామిగా ఉందన్న విషయాన్ని గుర్తుచేశారు.
మోదీ స్నేహితుడు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఆపరేషన్ సిందూర్ సమయంలో ప్రభుత్వం కంటే ముందే సీజ్ఫైర్ ప్రకటించారని గుర్తుచేశారు. ఆయనే యుద్ధం ఆపామని కనీసం 100 సార్లు చెప్పారని అయినప్పటికీ ప్రధాని మౌనంగా ఉన్నారని నిలదీశారు.
ఇరాన్ ఆయిల్ కొనవద్దని అమెరికా చెప్పిన వెంటనే ప్రభుత్వం వెనక్కి తగ్గిందన్నారు. అలాగే రష్యన్ ఆయిల్ కొనవద్దని ట్రంప్ చెప్పగానే ప్రభుత్వం దిగుమతులు తగ్గించిందని వెల్లడించారు.
ట్రేడ్ నుంచి ఆయిల్ వరకు, డేటా నుంచి స్నేహ దేశాలతో దీర్ఘకాలిక సంబంధాల వరకు ప్రధాని మోదీ అన్నీ వదులుకున్నారని ఖర్గే మండిపడ్డారు.
దివంగత ప్రధానులు నెహ్రూ, ఇందిరా గాంధీ మరియు అటల్ బిహారీ వాజ్పేయీ ఏ ప్రధాని కూడా మరో దేశ ఒత్తిడికి తల వంచలేదని తెలిపారు.










