MedhaGen AI MoU with Mallareddy University | మల్లారెడ్డి యూనివర్సిటీకి చెందిన స్కూల్ ఆఫ్ అలైడ్ అండ్ హెల్త్కేర్ సైన్సెస్ ఆధ్వర్యంలో శుక్రవారం ‘అలైడ్ అండ్ హెల్త్కేర్ ఇండస్ట్రీ సమిట్’ జరిగింది.
ఈ సదస్సులో మల్లారెడ్డి యూనివర్సిటీ ఫౌండర్ చైర్మన్ చామకూర మల్లారెడ్డి, డైరెక్టర్ ప్రీతి రెడ్డి, వైస్ ఛాన్సలర్ డాక్టర్ వీ.ఎస్.కె. రెడ్డి, డీన్స్ డాక్టర్ ఎస్. అపర్ణ, డాక్టర్ ఎం. సుజీర్ బాషా, డాక్టర్ భారతి, వివిధ మల్టీస్పెషాలిటీ హాస్పిటల్స్, వ్యాక్సిన్ తయారీ పరిశోధనా సంస్థలు మరియు డయాగ్నస్టిక్ ల్యాబ్ లకు చెందిన 40కి పైగా ప్రముఖ జాతీయ, అంతర్జాతీయ సంస్థలు మరియు ఆరోగ్య సంరక్షణ సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.
ఈ సమ్మిట్ వేదికగా భారతదేశంలో డిజిటల్ ఆరోగ్య సేవలను మరింత బలోపేతం చేసే దిశగా ఒక కీలక అడుగు పడింది. ప్రముఖ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంస్థ మెధాజెన్ ఏఐ (MedhaGen AI), హైదరాబాద్లోని మల్లారెడ్డి యూనివర్సిటీతో వ్యూహాత్మక అవగాహన ఒప్పందం (MoU) కుదుర్చుకుంది. అత్యాధునిక ఏఐ సాంకేతికతను సామాన్యుడి వైద్యానికి చేరువ చేయడం, క్లినికల్ రంగంలో కృత్రిమ మేధ వినియోగాన్ని పెంచడం ఈ భాగస్వామ్యం యొక్క ప్రధాన ఉద్దేశ్యం.
ప్రముఖ ఆరోగ్య నిపుణులు, పరిశోధకులు మరియు వైద్య ప్రముఖుల సమక్షంలో ఈ ఒప్పందంపై సంతకాలు జరిగాయి. మేధాజెన్ ఏఐ సీఈవో డా. భరత్ కుమార్ కక్కిరేణి, స్కూల్ ఆఫ్ అల్లైడ్ అండ్ హెల్త్ కేర్ సైన్సెస్ మల్లారెడ్డి యూనివర్సిటీ డీన్ డా. ఎస్ అపర్ణా రెడ్డి ఈ ఎంఓయూపై సంతకం చేశారు.
ప్రిసిషన్ మెడిసిన్ దిశగా అడుగులు
ఈ భాగస్వామ్యం ద్వారా మెధాజెన్ ఏఐ మరియు మల్లారెడ్డి యూనివర్సిటీ కలిసి ‘ఇంటెలిజెంట్ హెల్త్ ఎకోసిస్టమ్స్’ను నిర్మించనున్నాయి. యూనివర్సిటీ యొక్క పరిశోధనా మౌలిక సదుపాయాలను ఉపయోగించుకుంటూ.. ఎలక్ట్రానిక్ హెల్త్ రికార్డులను (EHR), ఓమిక్స్ డేటాతో అనుసంధానించనున్నారు. దీనివల్ల ప్రతి రోగికి వారి ఆరోగ్య స్థితిని బట్టి వ్యక్తిగతీకరించిన చికిత్స (Precision Medicine) అందించడం సాధ్యమవుతుంది.
ఏఐ ఆధారిత క్లినికల్ డెసిషన్ సపోర్ట్
మెధాజెన్ అభివృద్ధి చేసిన ‘క్లినికల్ డెసిషన్ సపోర్ట్’ (CDS) సిస్టమ్స్ను ఈ ఒప్పందంలో భాగంగా అందుబాటులోకి తెస్తారు. ఈ ఏఐ సాధనాలు వైద్యులకు అత్యంత వేగంగా, కచ్చితత్వంతో వ్యాధి నిర్ధారణ చేయడంలో తోడ్పడతాయి. ముఖ్యంగా మెడికల్ ఇమేజింగ్ మరియు ప్రివెంటివ్ హెల్త్ అనలిటిక్స్లో ఇవి విప్లవాత్మక మార్పులు తీసుకురానున్నాయి.
భవిష్యత్ వైద్యులకు శిక్షణ
వైద్య రంగంలో వస్తున్న సాంకేతిక మార్పులకు అనుగుణంగా తర్వాతి తరం వైద్యులను, పారామెడికల్ సిబ్బందిని ‘ఏఐ-రెడీ’గా తీర్చిదిద్దడం ఈ ఒప్పందంలోని మరో ముఖ్యమైన అంశం. విద్యార్థులకు, ఆరోగ్య నిపుణులకు ఏఐ టెక్నాలజీపై ప్రాయోగిక శిక్షణ ఇవ్వనున్నారు.
స్టార్టప్లకు ప్రోత్సాహం
వైద్య రంగంలో కొత్త ఆవిష్కరణలు చేసే స్టార్టప్ల కోసం ఒక ప్రత్యేక ప్లాట్ఫారమ్ను ఈ రెండు సంస్థలు కలిసి ఏర్పాటు చేయనున్నాయి. దీని ద్వారా కొత్త హెల్త్-టెక్ స్టార్టప్లు తమ ఏఐ పరిష్కారాలను వాస్తవ క్లినికల్ పరిస్థితుల్లో పరీక్షించుకునే అవకాశం లభిస్తుంది.
డేటా ఆధారిత ఆసుపత్రులుగా మార్చడమే లక్ష్యం: సీఈవో భరత్ కుమార్
ఈ సందర్భంగా మెధాజెన్ ఏఐ సీఈఓ డాక్టర్ భరత్ కుమార్ కక్కిరేణి మాట్లాడుతూ.. “మా లక్ష్యం పారదర్శకత ద్వారా నమ్మకాన్ని నిర్మించడం. ఆసుపత్రులను డేటా ఆధారితంగా మార్చడం అంటే కేవలం పనితీరును మెరుగుపరచడం మాత్రమే కాదు, కచ్చితమైన ముందస్తు నిర్ధారణల ద్వారా ప్రాణాలను కాపాడటం” అని పేర్కొన్నారు.
మల్లారెడ్డి యూనివర్సిటీ ప్రొఫెసర్ వినోద్ కుమార్ యాట మాట్లాడుతూ.. సాంకేతికతను మానవీయ విలువలతో జోడించి వైద్యం అందించడమే తమ లక్ష్యమని తెలిపారు. ఏఐ ఆధారిత ఇమేజింగ్ మరియు డిజిటల్ హెల్త్ రికార్డులు భవిష్యత్తులో సరసమైన ధరకే నాణ్యమైన వైద్యాన్ని అందిస్తాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
భవిష్యత్ ప్రణాళిక
ఈ ఒప్పందంతో మల్లారెడ్డి యూనివర్సిటీ అనుబంధ ఆసుపత్రులు ‘డిజిటల్ హాస్పిటల్స్’గా రూపాంతరం చెందనున్నాయి. డేటా విశ్లేషణ ద్వారా వ్యాధి ముప్పును ముందే గుర్తించడం, పరిపాలన భారాన్ని తగ్గించడం మరియు రోగి కేంద్రిత చికిత్సను అందించడంలో ఈ ప్రాజెక్ట్ దేశానికే ఒక రోల్ మోడల్గా నిలవనుంది.


సదస్సులో కేబీకే గ్రూప్ చైర్మన్, మెధాజెన్ ఏఐ సీఈవో డా. కక్కిరేణి భరత్ కుమార్ ను సన్మానిస్తున్న యూనివర్సిటీ డీన్స్ డా. అపర్ణ , డా. సుజీర్ బాషా









