BCCI-Apollo sponsorship | భారత క్రికెట్ జట్టు నూతన స్పాన్సర్ గా అపోలో టైర్స్ నిలిచింది. ఈ మేరకు బీసీసీఐతో ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందం 2025 నుంచి 2027 వరకు కొనసాగుతుంది. ఇది భారత క్రికెట్ చరిత్రలో అత్యంత లాభదాయకమైన డీల్ గా నిలిచినట్లు కథనాలు వస్తున్నాయి.
టీం ఇండియాకు జెర్సీ స్పాన్సర్గా డ్రీమ్-11 మొన్నటివరకు కొనసాగింది. అయితే ఇటీవలే ఆన్లైన్ గేమింగ్ బిల్లు పార్లమెంటులో ఆమోదం పొందింది. దీని కారణంగా డ్రీమ్11 తమ కార్యకలాపాలను నిలిపివేసింది. అనంతరం బీసీసీఐ డ్రీమ్-11తో ఉన్న ఒప్పందాన్ని అర్థాంతరంగా రద్దు చేసుకోవలసి వచ్చింది.
ఈ నేపథ్యంలో బీసీసీఐ తాజగా బిడ్డింగ్ నిర్వహించింది. ఇందులో అపోలో టైర్స్ అధిక బిడ్ వేసి గెలిచింది. మూడు సంవత్సరాల పాటు ఈ ఒప్పందం కొనసాగనుంది. దీని మొత్తం విలువ రూ.579 కోట్లు. ఈ మూడేళ్ళ కాలంలో భారత్ 130కి పైగా ద్వైపాక్షిక మ్యాచులు ఆడే అవకాశం ఉంది. అలాగే 21 ఐసీసీ టోర్నమెంట్ మ్యాచులు ఆడుతుంది. ఈ క్రమంలో ఒక్కో మ్యాచ్ కోసం రూ.4.5 కోట్లు చెల్లించనుంది. ఇకపోతే డ్రీమ్-11 రూ.4 కోట్లు చెల్లించేది.









