Jr NTR to Star in Dadasaheb Phalke Biopic? | టాలీవుడ్ అగ్ర కథానాయకుడు జూనియర్ ఎన్టీఆర్ కు సంబంధించిన ఓ వార్త నెట్టింట్లో తెగ హల్చల్ చేస్తోంది.
వరుస సినిమాలతో బిజీబిజీగా ఉన్న ఎన్టీఆర్ ఫాదర్ ఆఫ్ ఇండియన్ సినిమా దాదాసాహెబ్ ఫాల్కే బయోపిక్ లో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు బాలీవుడ్ లో ప్రచారం జరుగుతోంది. ఇదే నిజమైతే ఎన్టీఆర్ మునుపెన్నడూ కనిపించని పాత్రలో అభిమానుల్ని అలరించడం ఖాయం.
సుమారు రెండేళ్ల క్రితం దాదాసాహెబ్ ఫాల్కే జీవితం ఆధారంగా ‘మేడ్ ఇన్ ఇండియా’ మూవీ దర్శక ధీరుడు రాజమౌళి సమర్పణలో తెరకెక్కనున్నట్లు ప్రకటించారు. ఈ మూవీని రాజమౌళి తనయుడు కార్తికేయ మరియు వరుణ్ గుప్తా సంయుక్తంగా నిర్మిస్తారని వెల్లడించారు.
నేషనల్ అవార్డ్ విన్నర్ నితిన్ కక్కర్ దర్శకత్వం వహించనున్నారు. అయితే తాజాగా ఈ మూవీలో నటించేందుకు ఎన్టీఆర్ సుముఖత వ్యక్తం చేసినట్లు కథనాలు వస్తున్నాయి. రాజమౌళి, కార్తికేయ మరియు ‘మేడ్ ఇన్ ఇండియా’ మూవీ టీం కథను ఎన్టీఆర్ కు చెప్పినట్లు తెలుస్తోంది.
సినిమా స్టోరీ విన్న వెంటనే ఎన్టీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని ప్రచారం జరుగుతుంది. ఈ నేపథ్యంలో ఈ ప్రాజెక్టు ఒక్కసారిగా ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. అయితే అధికారిక ప్రకటన మాత్రం రావాల్సి ఉంది. ఒకవేళ మూవీలో ఎన్టీఆర్ నటించడం ఖాయమయితే ‘మేడ్ ఇన్ ఇండియా’ సినిమాలో ఎన్టీఆర్ దాదాసాహెబ్ ఫాల్కే పాత్రలో కనిపిస్తారు.
ఇప్పటికే ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నారు. అలాగే వార్-2 తో బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తున్న. ఇకపోతే దేవర-2 కూడా త్వరలో పట్టాలెక్కనుంది. కాగా 1913లో ‘రాజా హరిశ్చంద్ర’ సినిమాను దాదాసాహెబ్ ఫాల్కే తెరకెక్కించారు. ఇదే భారతీయ తొలి సినిమా.
తన జీవితంలో 95 ఫీచర్ సినిమాలను నిర్మించిన దాదాసాహెబ్ ఫాల్కే ను భారతీయ సినిమా పితామహుడిగా గుర్తింపు పొందారు.