56-year-old man sentenced to a total 161 years of rigorous imprisonment for sexually abusing autistic student | ఆటిజంతో బాధపడుతున్న పదేళ్ల బాలుడిపై ఓ టీచర్ ఘోరానికి పాల్పడ్డాడు. మిఠాయిలు ఇచ్చి తొలుత మచ్చిక చేసుకుని అనంతరం అత్యాచారం చేశాడు. బాలుడు సరిగ్గా మాట్లాడలేకపోయినప్పటికీ కాగితంపై బొమ్మలు గీసి తల్లిదండ్రులకు చూపించడంతో ఈ ఘోరం బయటపడింది. ఈ నేపథ్యంలో కేరళ కోర్టు సదరు నేరస్థుడికి 161 ఏళ్ల జైలు శిక్ష విధిస్తూ సంచలన తీర్పు వెలువరించింది. బాలుడిపై జరిగిన ఘోర లైంగిక దాడి కేసులో కేరళ ఫాస్ట్ ట్రాక్ స్పెషల్ కోర్టు (POCSO) సంచలనాత్మక తీర్పు ఇచ్చింది. 56 ఏళ్ల టీచర్ సంతోష్ కుమార్కు మొత్తం 161 ఏళ్ల కఠిన కారాగార శిక్ష విధించింది. ఈ తీర్పును జడ్జి అంజు మీరా బిర్లా శనివారం వెల్లడించారు. టీచర్ తిరువనంతపురం నివాసి. బాధిత బాలుడు చదివే ప్రత్యేక పాఠశాలలో అధ్యాపకుడిగా పనిచేసేవాడు. కన్నూరు కు చెందిన బాలుడు ఆటిజంతో బాధపడుతున్నాడు. చికిత్స కోసం తల్లిదండ్రులు బాలుడ్ని తిరువనంతపురం తీసుకువెళ్లారు. అక్కడే ఓ పాఠశాలలో చేర్పించారు.
2019లో ఆటిజం బాధితుడైన 10 ఏళ్ల బాలుడిని పాఠశాల బాత్రూమ్లో పలుమార్లు లైంగికంగా దాడి చేశాడు కీచక టీచర్. బాలుడి వికలాంగత్వాన్ని తనకు అనుకూలంగా ఉపయోగించుకుని, బెదిరిస్తూ, నిశ్శబ్దంగా ఉండమని హెచ్చరించేవాడని పోలీసు దర్యాప్తులో తేలింది. POCSO చట్టం, భారత శిక్షాస్మృతి వివిధ సెక్షన్ల కింద నిందితుడిని దోషిగా నిర్ధారించిన కోర్టు, పలు ఆరోపణలకు సంబంధించి వేర్వేరు శిక్షలు విధించింది. మొత్తం శిక్షాకాలం 161 ఏళ్లుగా ఉంది. అయితే శిక్షలు ఏకకాలంలో (concurrently) అమలవుతాయి కాబట్టి, నిందితుడు 20 ఏళ్లు మాత్రమే జైల్లో గడపాల్సి ఉంటుంది. అదనంగా రూ.87,000 జరిమానా విధించింది. జరిమానా చెల్లించకపోతే మరో 8.5 ఏళ్ల జైలు శిక్ష అమలవుతుంది.ఈ కేసులో పోలీసులు బలమైన ఆధారాలను సేకరించి, నేరాన్ని కోర్టులో నిరూపించారు. బాధితుడి పరిస్థితిని దుర్వినియోగం చేసిన కీచక టీచర్ చర్యలు సమాజంలో తీవ్ర ఆగ్రహాన్ని కలిగించాయి.










