Wife Gives Divorce Husband | ఇటీవల కాలంలో విడాకుల సంఖ్య గణనీయంగా పెరిగిపోతున్నట్లు పలు సర్వేల్లో తేలింది. చిన్న చిన్న కారణాలతోనే దంపతులు పెళ్లై కనీసం ఏడాది పూర్తవకుండానే డివోర్స్ (Divorce) కోసం కోర్టు మెట్లు ఎక్కుతున్నారు.
కొంతమంది మరీ సిల్లీ రీజన్స్ తో విడిపోతున్నారు. తాజాగా కర్ణాటకలో ఓ మహిళ భర్తకు విడాకులు ఇవ్వడానికి చెప్పిన కారణం విని పోలీసులు కూడా అవాక్కయ్యారు. తన భర్తకు బుల్లెట్ బైక్ నడపడం రాదనే వింత కారణంతో విడాకులు ఇచ్చింది.
అంతటితో ఆగకుండా ఆపై వరుస పెళ్లిళ్లతో ముగ్గురు వ్యక్తులను బురిడీ కొట్టించింది. పోలీసుల వివరాల ప్రకారం.. దొడ్డబళ్లాపుర ప్రాంతానికి చెందిన సుధారాణి అనే మహిళకు గతంలో వివాహమై ఇద్దరు పిల్లలు ఉన్నారు.
అయితే, తన భర్తకు రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్ బైక్ నడపడం రాదని, అది తనకు ఇష్టం లేదని గొడవ పెట్టుకుంది. ఇదే కారణంతో కన్న పిల్లలను వదిలేసి మొదటి భర్తకు విడాకులు ఇచ్చేసింది. ఆ తర్వాత అనంతమూర్తి అనే వ్యక్తికి వల వేసి రెండో పెళ్లి చేసుకుంది.
కొద్దిరోజులు కాపురం చేసిన తర్వాత అతని దగ్గర రూ. 20 లక్షల నగదును కాజేసి పరారైంది. అనంతరం సుధారాణి కనకపురకు చెందిన మరో వ్యక్తిని ట్రై చేసింది. అయితే ఆ వ్యక్తి ఆమె ట్రాప్ లో పడకుండా తప్పించుకున్నారు. ఆమె మోసాలను గుర్తించిన బాధితులు పోలీసులను ఆశ్రయించారు. ముగ్గురు వ్యక్తులను మోసం చేసిన ఈ ‘కిలాడీ లేడీ’పై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.






