Hyd CP Sajjanar | టీజీఎస్ఆర్టీసీ (TGSRTC) మాజీ ఎండీ వీసీ సజ్జనర్ (VC Sajjanar) మళ్లీ యూనిఫాం తొడిగారు. హైదరాబాద్ కొత్వాల్ గా మంగళవారం ఆయన బాధ్యతలు చేపట్టారు. నగర పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం, ఇప్పటివరకు హైదరాబాద్ కమిషనర్ గా ఉన్న సీవీ ఆనంద్ నుంచి ఆయన అధికారికంగా బాధ్యతలు స్వీకరించారు.
అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. దేశంలోనే వేగంగా అభివృద్ధి చెందుతున్న హైదరాబాద్ నగరంలో ప్రధాన సమస్య డ్రగ్స్ అని తెలిపారు. డ్రగ్స్ పై ఉక్కుపాదం మోపి, డ్రగ్స్ సరఫరాదారులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అదే విధంగా నగరంలో సైబర్ నేరాలు అరికట్టేందుకు అనేక చర్యలు చేపట్టామని తెలిపారు.
సైబర్ నేరాలపై నగర ప్రజలంతా అవగాహన పెంచుకోవాలని సూచించారు. ఆన్లైన్ బెట్టింగ్ వల్ల యువత బాగా చెడిపోతోందన్నారు. ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్ కి ప్రమోషన్ చేయవద్దని వీఐపీలకు విజ్ఞప్తి చేశారు. నగరంలో కల్తీ ఆహరంపై ప్రతేక దృష్టి పెడతామనీ, ప్రత్యేక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేస్తామని తెలిపారు.
నగరంలో పెరుగుతున్న ట్రాఫిక్ సమస్యలు తగ్గించేందుకు కృషి చేస్తామన్నారు. మద్యం తాగి రోడ్లపైకి వాహనాలతో వస్తే వదిలేది లేదనీ, వాళ్లను రోడ్ టెర్రరిస్టులుగా భావిస్తామని హెచ్చరించారు. ఇక చిన్నారులు, మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని సీపీ సజ్జనర్ వార్నింగ్ ఇచ్చారు.









