- గ్రీన్ బిల్డింగ్ అవార్డు అందుకున్న మంత్రి ప్రశాంత్ రెడ్డి
హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ సచివాలయం యావత్ దేశాన్ని ఆకర్షిస్తోంది. ఏప్రిల్ 30న లాంఛనంగా ప్రారంభమైన సచివాలయంలో సీఎం కేసీఆర్ తో పాటు మంత్రులు తమ ఛాంబర్ లలో కొలుదీరారు. తెలంగాణకే గౌరవ సూచకంగా ఉన్న ఈ సెక్రటేరియన్ భవన సముదాయాన్ని చూసేందుకు ప్రజలు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు.
హైదరాబాద్ నడిబొడ్డున హుస్సేన్ సాగర్ ఒడ్డున నిర్మితమైన ఈ సచివాలయం తొలి రోజే అరుదైన అవార్డును సొంతం చేసుకుంది. ఈ భవన సముదాయానికి ప్రతిష్టాత్మక గ్రీన్ బిల్డింగ్ అవార్డ్ లభించింది.
భారతదేశంలోనే మొట్ట మొదటి గోల్డ్ రేటెడ్ సెక్రటేరియట్ బిల్డింగ్ కాంప్లెక్స్ గా మన సచివాలయం రికార్డు సాధించింది. ఈ అవార్డు రావడంపై తెలంగాణ ప్రభుత్వం హర్షం వ్యక్తం చేసింది. అవార్డును తెలంగాణ రోడ్ల, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి స్వీకరించారు.
కొత్త సచివాలయంలో సోమవారం ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ సభ్యులు మంత్రి ప్రశాంత్ రెడ్డిని కలిసి అవార్డును అందించారు. అవార్డు అందుకోవడంపై హర్షం వ్యక్తం చేసిన అనంతరం మంత్రి మాట్లాడారు.
సీఎం కేసీఆర్ ఆలోచనలకు అనుగుణంగా అత్యంత విశాలంగా, అధునాతన హంగులతో పర్యావరణహితంగా కొత్త సచివాలయం నిర్మించామని తెలిపారు. ఈ ఘనత ప్రకృతి ప్రేమికుడైన సీఎం కేసీఆర్ కు దక్కుతుందని పేర్కొన్నారు.
త్వరలో సచివాలయంలో సోలార్ విద్యుత్ ప్యానెళ్లు కూడా ఏర్పాటు చేయనున్నట్ల మంత్రి వెల్లడించారు. సచివాలయం త్వరలోనే ప్లాటినం అవార్డు కూడా సొంతం చేసుకుంటుందని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి విశ్వాసం వ్యక్తం చేశారు.