Telangana EV Policy 2026 | పర్యావరణ పరిరక్షణే ధ్యేయంగా తెలంగాణ ప్రభుత్వం (Telangana Government) ప్రతిష్టాత్మకమైన ఎలక్ట్రిక్ వాహన (EV) విధానాన్ని అమలు చేస్తోంది.
ఈ క్రమంలో ప్రభుత్వ ఉద్యోగులను ఈవీల వైపు ప్రోత్సహించేందుకు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (CS) రామకృష్ణ రావు కీలక నిర్ణయాలను వెల్లడించారు.
సోమవారం జరిగిన మీడియా సమావేశంలో రవాణా, పోలీసు మరియు ఐ అండ్ పీఆర్ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. “ఢిల్లీ లాగా హైదరాబాద్ కాలుష్య కోరల్లో చిక్కుకోకూడదనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈవీ పాలసీని తీసుకొచ్చారు.
పర్యావరణాన్ని కాపాడుకోవడం మనందరి బాధ్యత” అని మంత్రి పొన్నం తెలిపారు. ఈవీ పాలసీ ద్వారా జీరో రోడ్ టాక్స్ మరియు జీరో రిజిస్ట్రేషన్ ఫీజు మినహాయింపు ఇస్తున్నట్లు చెప్పారు. దీనివల్ల ప్రభుత్వానికి దాదాపు రూ. 1000 కోట్ల ఆదాయం తగ్గినప్పటికీ, పర్యావరణం కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు.
మహీంద్రా ఎలక్ట్రిక్, ఏథర్ ఎనర్జీ, ఓలా, గ్రావిటన్ వంటి ప్రముఖ కంపెనీలు ప్రభుత్వ ఉద్యోగులకు 10% నుండి 20% వరకు డిస్కౌంట్ ఇచ్చేందుకు ముందుకు వచ్చాయని మంత్రి తెలిపారు.
రాష్ట్రవ్యాప్తంగా రెడ్కో (REDCO) ద్వారా విస్తృతంగా ఛార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేస్తున్నామని, ప్రభుత్వ శాఖలు కూడా ఇకపై ఈవీ వాహనాలనే కొనుగోలు చేయాలని సీఎం సూచించినట్లు పేర్కొన్నారు.
రవాణా శాఖలో సంస్కరణల భాగంగా తెలంగాణ ‘వాహన్’ పోర్టల్లోకి చేరిందని, ఇకపై షోరూమ్లోనే వాహన రిజిస్ట్రేషన్ చేసుకునే వెసులుబాటు కలుగుతుందని తెలిపారు.
సిఎస్ రామకృష్ణ రావు గారి వ్యాఖ్యలు: రాష్ట్ర జనాభాలో 30 శాతం హైదరాబాద్లోనే నివసిస్తున్నారని, ఇక్కడ ఎయిర్ క్వాలిటీ తగ్గకుండా ఉండాలంటే ఈవీల వాడకం అనివార్యమని సీఎస్ పేర్కొన్నారు.
ప్రభుత్వం ఇస్తున్న ఇన్సెంటివ్లను ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఆదర్శంగా నిలిచేందుకు తొలుత సీఎస్ మరియు ఉద్యోగ సంఘాల నేతలు ఈవీ వాహనాలను బుక్ చేసుకున్నారు.






