Friday 20th March 2026
12:07:03 PM
Home > తాజా > TG Budget 2026-27: కొత్త పథకాలు ఇవే!

TG Budget 2026-27: కొత్త పథకాలు ఇవే!

New Scheme In TG Budget | తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి భారీ బడ్జెట్‌ను శాసనసభలో ప్రవేశపెట్టింది.

ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక మంత్రి మల్లు భట్టి విక్రమార్క మొత్తం రూ. 3,24,234 కోట్లతో కూడిన వార్షిక పద్దును సభకు సమర్పించారు.

రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, అప్పుల భారం మరియు ఆదాయ వనరులను విశ్లేషిస్తూనే, ప్రభుత్వం ఈసారి పలు నూతన పథకాలను ప్రకటించింది.

తాజా బడ్జెట్ లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రకటించిన కొత్త పథకాలు

  1. ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం:
    తెలంగాణ రాష్ట్రంలోని ప్రజలందరి సంక్షేమం కొరకు సామాజిక అంతరాలతో సంబంధం లేకుండా పేద, మధ్యతరగతి, ధనిక అని తేడా చూడకుండా రాష్ట్రంలోని 1 కోటి 15 లక్షల కుటుంబాలకుప్రతి కుటుంబానికి ఐదు లక్షల రూపాయల జీవిత బీమా అందించే విధంగా జూన్, 02, 2026 నుండి “ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం” ను ప్రారంభిస్తున్నాం. ఈ పథకానికి బడ్జెట్ లో రూ.4,000 కోట్లు ప్రతిపాదించాం.
  2. చేయూత:
    చేయూత పథకానికి అర్హులైన వారికి 2 లక్షల నూతన పెన్షన్లను మంజూరు చేస్తున్నాం. ఈ పథకం మొత్తానికి బడ్జెట్ లో రూ.14,861 కోట్లు ప్రతిపాదించాం.
  3. తెలంగాణ ప‌బ్లిక్ స్కూళ్ళు:
    ఎంపిక చేసిన ప్రస్తుత ప్రభుత్వ పాఠశాలలను ఆధునిక మౌలిక సదుపాయాలు, శిక్షణ పొందిన ఉపాధ్యాయులు, డిజిటల్ సదుపాయాలు, ప్రత్యేక రవాణా వ్యవస్థలతో అన్ని వనరులతో కూడిన తెలగాణ పబ్లిక్ స్కూళ్ళు గా మార్పు చేయాలని ప్రతిపాదించాం. ఈ స్కూళ్ళలో ప్రీ ప్రైమరీ నుండి 12 వ తరగతి వరకు 1500 మంది విద్యార్థులకు విద్య అందించబడుతుంది.
    ఈ పథకం మొత్తానికి బడ్జెట్ లో రూ.500 కోట్లు ప్రతిపాదించాం.
  4. విద్యార్థులకు బ్రేక్‌ఫాస్ట్ పథకం:
    2026–27 విద్యా సంవత్సరం నుంచి ప్రీ-ప్రైమరీ నుండి ఇంటర్మీడియట్ వరకు చదువుతున్న విద్యార్థులకు నాణ్యమైన పోషకాలతో రాష్ట్రంలో నూతనంగా బ్రేక్‌ఫాస్ట్ పథకాన్ని ప్రారంభిస్తున్నాం. ఈ బ్రేక్‌ఫాస్ట్‌లో ప్ర‌తి విద్యార్థికివారానికి మూడు రోజులు పాలు మరియు మిగతా మూడు రోజులు రాగి జావ అందిస్తాము. ఈ పథకం మొత్తానికి బడ్జెట్ లో రూ.800 కోట్లు ప్రతిపాదించాం.
  5. ఇంటర్మీడియట్ విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకం:
    ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ఇంటర్మీడియట్ అభ్యసిస్తున్న విద్యార్థులకు కూడా ఇకపై నూతనంగా మధ్యాహ్న భోజన పథకాన్ని విస్తరిస్తున్నాం. ఈ పథకం మొత్తానికి బడ్జెట్ లో రూ.100 కోట్లు ప్రతిపాదించాం.
  6. నగదు రహిత ఆరోగ్య భద్రత పథకం:
    ఉద్యోగస్తులు, పెన్షనర్లు, వారిపై ఆధారపడిన కుటుంబ సభ్యులందరికీ దాదాపు 23 లక్షల 51 వేల మందికి నగదు రహిత ఆరోగ్య భద్రత పథకాన్ని ప్రారంభిస్తున్నాం. ఈ నగదు రహిత ఆరోగ్య భద్రత పథకాన్ని రాజీవ్ ఆరోగ్యశ్రీ ట్రస్టు ద్వారా అమలు చేస్తాం. ప్రభుత్వ ఆసుపత్రులతో పాటు 421 ఎంపానెల్ ప్రయివేట్ ఆసుపత్రులలో 1,998 వ్యాధులకు ఈ పథకం ద్వారా చికిత్సను పొందవచ్చు. ప్రతి ఉద్యోగికి డిజిటల్ హెల్త్ కార్డు అందిస్తాం.
  7. ఉద్యోగుల ప్రమాద బీమా పథకం:
    ఉద్యోగుల భద్రత కోసం దేశంలోనే తొలిసారిగా సమగ్ర ప్రమాద బీమా పథకాన్ని ప్రవేశపెట్టాం. ఈ పథకం ద్వారా రాష్ట్రంలో పనిచేస్తున్న ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు ప్రమాదవశాత్తు మరణిస్తే 1 కోటి 20 లక్షల రూపాయల ప్రమాద బీమా వర్తిస్తుంది, 60 ఏండ్ల వరకు 10 లక్షల రూపాయాల టర్మ్ లైఫ్ ఇన్సూరెన్స్, విమాన ప్రమాదంలో మరణిస్తే2కోట్ల రూపాయలుఅదనపుకవరేజి లభించే విధంగా ఈ పథకాన్ని రూపకల్పన చేశాం.ఈ పథకం 7 లక్షల 57 వేల ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్లకు వర్తిస్తుంది.
    ఈ రెండు పథకాల మొత్తానికి బడ్జెట్ లో రూ.1,056 కోట్లు ప్రతిపాదించాం.
  8. సి.ఎం. ఓవర్సీస్ ఎంప్లాయిమెంట్ ప్రోగ్రాం:
    రాష్ట్ర యువతకు వివిధ రంగాలలో తగిన నైపుణ్య శిక్షణను మరియు వారికి ఉపాధి లభించిన ఆయా దేశాలకు సంబంధించిన భాషా జ్ఞానంలో శిక్షణ ఇప్పించడం, వారికివీసా మార్గదర్శకత మరియు విదేశీ ప్రయాణానికి కావలసిన రక్షణను ఇచ్చి విదేశాలలో ఆరోగ్య సేవలు, హస్పిటాలిటీ, నిర్మాణపు పనులు, లాజిస్టిక్స్ వంటి రంగాల్లో ఉద్యోగ అవకాశాలు కల్పించడం కోసం “సి.ఎం.ఓవర్సీస్ ఎంప్లాయిమెంట్ ప్రోగ్రాం”ను ప్రారంభిస్తున్నాం. ఈ బడ్జెట్ లో సి.ఎం.ఓవర్సీస్ ఎంప్లాయిమెంట్ ప్రోగ్రాం పథకానికి రూ.1,056 కోట్లు ప్రతిపాదించాం.
  9. ATC ట్రైనీలకు స్కాలర్ షిప్:
    ATC లో శిక్షణ పొందుతున్న ట్రైనీలకు ప్రతినెల 2 వేల రూపాయలు స్కాలర్ షిప్ రూపంలో ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ బడ్జెట్ లో ATC ట్రైనీలకు స్కాలర్ షిప్ పథకానికి రూ.80 కోట్లు ప్రతిపాదించాం.

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions