Supreme Court On UCC | మన దేశంలో ఉమ్మడి పౌర స్మృతి (Uniform Civil Code) పై భారత అత్యున్నత న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు చేసింది. దేశంలో యూనిఫాం సివిల్ కోడ్ అమలుకు సమయం ఆసన్నమైందని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది.
1937 నాటి షరియత్ చట్టం ముస్లిం మహిళల పట్ల వివక్ష చూపుతోందంటూ దాఖలైన పిటిషన్ను విచారించిన ధర్మాసనం, ఈ అంశంపై పార్లమెంటు చొరవ తీసుకోవాల్సిన అవసరం ఉందని స్పష్టం చేసింది.
చీఫ్ జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోయ్ మాల్య బాగ్చీ, జస్టిస్ ఆర్. మహదేవన్లతో కూడిన ధర్మాసనం ఈ కేసును విచారించింది. ఒకవేళ కోర్టు షరియత్ చట్టాన్ని రద్దు చేస్తే, ముస్లిం వారసత్వ ఆస్తుల నిర్వహణకు సంబంధించి చట్టపరమైన శూన్యం ఏర్పడుతుందని సీజేఐ ఆందోళన వ్యక్తం చేశారు.
సంస్కరణల పట్ల అత్యుత్సాహం చూపిస్తే, ప్రస్తుతం లభిస్తున్న ప్రయోజనాలను కూడా మహిళలు కోల్పోయే ప్రమాదం ఉందని హెచ్చరించారు. రాజ్యాంగంలోని ఆదేశిక సూత్రాల ప్రకారం ఉమ్మడి పౌర స్మృతిని తీసుకురావడం శాసనసభ పరిధిలోని అంశమని జస్టిస్ బాగ్చీ పేర్కొన్నారు.
వివక్షకు వ్యతిరేకంగా ఈ కేసు బలంగా ఉన్నప్పటికీ, తుది నిర్ణయాన్ని పార్లమెంటు విజ్ఞతకే వదిలేయడం ఉత్తమమని ధర్మాసనం అభిప్రాయపడింది. “దీనికి సరైన సమాధానం ఒక్కటే.. అది ఉమ్మడి పౌర స్మృతి” అని సీజేఐ వ్యాఖ్యానించారు.









