Jodhpur Murders | రాజస్థాన్ రాష్ట్రంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు అత్యంత పాశవికంగా హత్యకు గురయ్యారు.
ఆరునెలల పసిపాప సహా నలుగురు కుటుంబ సభ్యులను హతమార్చి ఇంటిలోనే దహనం చేశాడు దుండగుడు. హత్యకు పాల్పడింది కుటుంబానికి సమీప బంధువైన 19 ఏళ్ల యువకుడని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం రాజస్థాన్ లోని చౌరాయ్ గ్రామంలో గత రాత్రి ఈ దారుణ ఘటన జరిగింది.
పునరామ్ (55) అనే వ్యక్తి ఇంటి నుంచి పొగలు రావడాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు ఫోన్ చేశారు.
వారి బంధువులు ఇంట్లోకి అడుగుపెట్టి చూడగా, ఇంటిలో పునరామ్, అతని భార్య భన్వ్రీ (50), కోడలు ధాపు కాలిపోయిన మృతదేహాలను కనుగొన్నారు.
ధాపు శరీరం పక్కన నల్లటి బూడిద ఉండటంతో అవి ఆమె ఆరు నెలల కుమార్తె అవశేషాలుగా గుర్తించారు.
హంతకుడు నలుగురి గొంతు కోసి హత్య చేసి, మృతదేహాలను ప్రాంగణంలోకి లాగి నిప్పంటించినట్లు తెలుస్తోంది.
ఈ హత్యలు వ్యక్తిగత శత్రుత్వం వల్లే జరిగి ఉండవచ్చని, తమ దర్యాప్తులో ప్రతి కోణాన్ని పరిశీలిస్తున్నామని పోలీసులు తెలిపారు.
ఫోరెన్సిక్ బృందం ఘటనా స్థలంలో ఆధారాలు సేకరిస్తోంది. కలెక్టర్ హిమాన్షు గుప్తా మరియు జోధ్పూర్ రూరల్ పోలీస్ చీఫ్ ధర్మేంద్ర సింగ్తో సహా జిల్లా ఉన్నతాధికారులు ఈ ప్రాంతంలో పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు.
మండిపడ్డ బీజేపీ..
జోధ్పూర్ ఘటనపై సీఎం అశోక్ గెహ్లాట్ ప్రభుత్వంపై బీజేపీ మండిపడింది. రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితిపై రాష్ట్ర బీజేపీ విభాగం ప్రశ్నలు సంధించింది.
‘‘ముఖ్యమంత్రి సొంత జిల్లాలోనే శాంతిభద్రతల పరిస్థితి ఇలా ఉంటే మిగతా చోట్ల పరిస్థితి ఏంటి? అని రాష్ట్ర బీజేపీ ట్వీట్ చేసింది.
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రాజస్థాన్లో రోజూ 17 అత్యాచారాలు, ఏడు హత్యలు జరుగుతున్నాయని బికనీర్ ఎంపీ, కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ ఆరోపించారు.
రాజస్థాన్ శాంతిభద్రతల పరిస్థితికి పూర్తిగా సీఎం గెహ్లాట్ బాధ్యత వహించాలని మేఘవాల్ వ్యాఖ్యానించారు.










