Saraswati Pushkaralu 2025 News | దక్షిణ ప్రయాగ తెలంగాణ కాళేశ్వరంలో సరస్వతీ పుష్కరాలకు సర్వం సిద్ధమయ్యింది. మహాప్రముఖ పుణ్యక్షేత్రాల్లో ఒకటైన కాళేశ్వర ముక్తీశ్వర పుణ్యక్షేత్రం సరస్వతీ పుష్కరాలకు సిద్ధమవుతున్నది.
పవిత్రమైన సరస్వతీ పుష్కరాలు మే 15 నుంచి మే 26 వరకు జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని కాళేశ్వరం వద్ద ఘనంగా జరగనున్నాయి. ప్రతి 12 ఏళ్లకు ఒకసారి జరిగే ఈ మహోత్సవాన్ని తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తోంది.
ఈ సందర్భంగా రూ. 35 కోట్లతో అధునాతన నిర్మాణాలు, రూ. 8 కోట్ల నిధులతో భక్తుల సౌకర్యార్థం ఏర్పాట్లు చేస్తున్నారు. 2013లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ గా ఉన్న సమయంలో సరస్వతీ పుష్కరాలు జరిగాయి. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత తొలిసారి ఈ పుష్కరాలు జరగనుండడం విశేషం.
సరస్వతి పుష్కరం అనేది సరస్వతి నదికి జరిగే పండుగ. ఇది సాధారణంగా ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది. సరస్వతి నదిని త్రివేణి సంగమం వద్ద ప్రవహించే అంతర్వాహినిగా పరిగణిస్తారు. ఈ పుష్కరాన్ని బృహస్పతి మిథున రాశిలోకి ప్రవేశించినప్పటి నుంచి 12 రోజుల పాటు ఆచరిస్తారు.
మే 14న రాత్రి 10.35 గంటలకు బృహస్పతి మిథున రాశిలోకి ప్రవేశించే సమయంలో పుష్కరకాలం ప్రారంభం కానుంది. మరుసటి రోజు సూర్యోదయం నుంచి పుష్కర పుణ్యస్నానాలు ఆచరించాల్సి ఉంటుంది. దేశంలో ఎక్కడాలేని విధంగా ఒకే పానవట్టంపై కాళేశ్వర, ముక్తీశ్వర స్వామి రెండు శివలింగాలు ఉన్న పుణ్యక్షేత్రం కాళేశ్వరం ఒక్కటే.
ఈ రెండు లింగాలకు నిత్యం అభిషేకించిన నీరు గోదావరి, ప్రాణహిత నదుల సంగమ స్థానంలో కలుస్తుండటంతో ఇక్కడి సరస్వతి నదిని అంతర్వాహినిగా పిలుస్తారు.