Nara Lokesh Fires On Jagan | మాజీ ముఖ్యమంత్రి జగన్ పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు మంత్రి నారా లోకేశ్. మొంథా తుఫాన్ మూలంగా నష్టపోయిన పంట పొలాలని జగన్ పరిశీలించిన విషయం తెల్సిందే. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ..లక్షల ఎకరాల్లో పంటలు నష్టపోతే ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి లోకేశ్ రైతులను పట్టించుకోకుండా ఒకరు లండన్ కు మరొకరు ముంబయికి వెళ్లిపోయారని విమర్శలు గుప్పించారు.
ఈ నేపథ్యంలో లోకేశ్ ధీటుగా బదులిచ్చారు. అప్పుడప్పుడు ఆంధ్రప్రదేశ్కు వచ్చే వైఎస్ జగన్ ఎప్పుడూ జనం మధ్య ఉండే తమ వైపు ఒక వేలెత్తి చూపిస్తున్నారని కానీ జగన్ వైపు 4 వేళ్లు చూపుతున్నాయని మర్చిపోతున్నారని ఎద్దేవా చేశారు. తుఫాను హెచ్చరిక వచ్చిన నుంచీ సాధారణ పరిస్థితి నెలకొనే దాకా ముఖ్యమంత్రి నుంచి ఎమ్మెల్యే వరకు.. చీఫ్ సెక్రటరీ నుంచి విలేజ్ సెక్రటరీ వరకు అంతా ప్రజల చెంతే ఉన్నట్లు తెలిపారు. కానీ ఇవన్నీ జగన్ కు తెలీదని కారణం ఆయన రాష్ట్రంలో లేరని జగన్ ది వేరే భ్రమాలోకం అని ధ్వజమెత్తారు. అందులో విహరిస్తుంటే, ఇవన్నీ తెలియవన్నారు.
‘నాకు మహిళలంటే గౌరవం, దేశమంటే భక్తి. అందుకే మహిళల వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ చూడటానికి ముంబై వెళ్లాను. కోట్లాది భారతీయులు తలెత్తుకునేలా మహిళా మణులు వరల్డ్ కప్ గెలిస్తే, నేనే గెలిచినంత ఆనందించాను. సొంత తల్లి, చెల్లిని తరిమేసిన మీకు దేశభక్తి, మహిళా శక్తి గురించి ఏం తెలుస్తుందిలే’ అని లోకేశ్ హాట్ కామెంట్స్ చేశారు.










