– కేటీఆర్కు మంత్రి కోమటిరెడ్డి స్ట్రాంగ్ కౌంటర్
Minister Komatireddy Counter To KTR | తెలంగాణ శాసనసభ (Telangana Assembly) లో ధన్యవాద తీర్మానంపై చర్చ సందర్భంగా కేటీఆర్, మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మధ్య మాటల యుద్ధం తారస్థాయికి చేరింది.
“ప్రభుత్వానికి ఎందుకు ధన్యవాదాలు చెప్పాలి?” అన్న కేటీఆర్ ప్రశ్నకు, మంత్రి కోమటిరెడ్డి పాయింట్ల వారీగా కౌంటర్ ఇచ్చారు. కేటీఆర్ గారు ఓపిక తెచ్చుకుని తాము చేస్తున్న అభివృద్ధిని వినాలని సూచించారు.
మంత్రి కోమటిరెడ్డి తన ప్రసంగంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలను ఏకరువు పెట్టారు. “మీరు ఇవ్వని కొత్త తెల్ల రేషన్ కార్డులు, సన్న బియ్యం మేము ఇస్తున్నాం.. అందుకు ధన్యవాదాలు చెప్పాలి. ₹20 వేల కోట్లతో అంతర్జాతీయ స్థాయిలో ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ నిర్మిస్తున్నందుకు కృతజ్ఞతలు తెలపాలి.
ఆడబిడ్డలు గుడికి, బడికి ఎక్కడికి వెళ్లినా ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తూ.. ఆర్టీసీకి ₹11 వేల కోట్లు చెల్లించాం. ఇందుకైనా మాకు ధన్యవాదాలు చెప్పాలి. “ప్రతి గ్రామంలో ₹5 లక్షల సాయంతో ఇందిరమ్మ ఇళ్లు కడుతున్నాం. మీరు దళితున్ని సీఎం చేస్తామని, డబుల్ బెడ్రూం ఇళ్లు ఇస్తామని మోసం చేశారు.. కానీ మేము చేసి చూపిస్తున్నాం.
బిఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్రాన్ని లక్షల కోట్ల అప్పుల ఊబిలోకి నెట్టారు. ప్రాజెక్టులు లేవు, భూసేకరణ లేదు.. కేవలం అప్పులు మాత్రమే చేశారు. మేం ఈ రెండున్నర ఏళ్లలో ₹3.25 లక్షల కోట్ల అప్పులకు బాకీలు చెల్లిస్తూ రాష్ట్రాన్ని గాడిన పెడుతున్నాం.
ఈ పదేళ్ల కాలంలో ప్రజలను మోసం చేసినందుకు మీరు క్షమాపణ చెప్పాలి” అని మంత్రి డిమాండ్ చేశారు. కోమటిరెడ్డి ప్రసంగం అంతటా “తప్పకుండా ధన్యవాదాలు చెప్పాలి” అంటూ కేటీఆర్పై సెటైర్లు వేయడం సభలో చర్చనీయాంశంగా మారింది.






