Marubeni To Invest 1000 crore For Future City In Telangana | ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రతినిధి బృందం జపాన్ పర్యటనలో తొలి రోజు కీలక పెట్టుబడి ఒప్పందాలను కుదుర్చుకుంది. జపాన్కు చెందిన వ్యాపార దిగ్గజం మరుబెనీ తెలంగాణలో పెట్టుబడులకు ముందుకొచ్చింది.
హైదరాబాద్ ఫ్యూచర్ సిటీలో నెక్స్ట్ జనరేషన్ ఇండస్ట్రియల్ పార్క్ను ఏర్పాటు చేసేందుకు మరుబెనీ ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుంది. టోక్యోలో మరుబెనీ ప్రతినిధులు ముఖ్యమంత్రిని కలిసి, ఫ్యూచర్ సిటీలో ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటుకు సంబంధించిన ప్రతిపాదనలు, పెట్టుబడులపై చర్చించారు.
మరుబెనీ రూ. 1,000 కోట్ల ప్రారంభ పెట్టుబడితో ఈ ప్రాజెక్టును చేపట్టనుంది. ఫ్యూచర్ సిటీలో 600 ఎకరాల్లో దశలవారీగా ప్రపంచ స్థాయి నెక్స్ట్ జనరేషన్ ఇండస్ట్రియల్ పార్క్ను అభివృద్ధి చేసేందుకు ప్రతిపాదనలు రూపొందించింది. ఈ ఒప్పందానికి సంబంధించిన లెటర్ ఆఫ్ ఇంటెంట్ పై ముఖ్యమంత్రి సమక్షంలో రాష్ట్ర ప్రభుత్వ అధికారులు, మరుబెనీ ప్రతినిధులు సంతకాలు చేశారు.
జపాన్ మరియు ఇతర మల్టీనేషనల్ కంపెనీలు హైదరాబాద్లో తమ తయారీ ప్లాంట్లను ఏర్పాటు చేసేందుకు ఈ ఇండస్ట్రియల్ పార్క్ను అభివృద్ధి చేస్తారు. దీని ద్వారా రూ. 5,000 కోట్లకు పైగా పెట్టుబడులను ఆకర్షించే అంచనా ఉందని అధికారులు పేర్కొన్నారు.
ఈ పార్క్ ఫ్యూచర్ సిటీలో అభివృద్ధి చేసే తొలి ప్రాజెక్ట్ అవుతుందని సీఎం పేర్కొన్నారు. దీని ద్వారా తెలంగాణలో సుమారు 30,000 ప్రత్యక్ష, పరోక్ష ఉద్యోగ అవకాశాలు సృష్టించబడి, జీవనోపాధి మెరుగుపడుతుందని తెలిపారు.