– అసెంబ్లీ సాక్షిగా కాంగ్రెస్ సర్కార్పై కేటీఆర్ నిప్పులు!
KTR Slams Congress Government | తెలంగాణ బడ్జెట్ సమావేశాల వేళ రాజకీయ సెగలు రాజుకున్నాయి. రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీసేందుకు బీఆర్ఎస్ తన అమ్ములపొదిలోని అస్త్రాలన్నింటినీ సిద్ధం చేసుకుంది.
ఈరోజు సోమవారం అసెంబ్లీ సమావేశాల ప్రారంభానికి ముందు గన్పార్క్లోని అమరవీరుల స్తూపానికి నివాళులర్పించిన అనంతరం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ పాలనపై నిప్పులు చెరిగారు.
రాహుల్ గాంధీకి ఏటీఎంలా తెలంగాణ?
తెలంగాణను ఏఐసీసీ (AICC)కి ఏటీఎంలా మార్చారని కేటీఆర్ సంచలన ఆరోపణలు చేశారు. “రాష్ట్ర రైతాంగానికి రైతుబంధు ఇచ్చేందుకు పైసలు లేవు కానీ, రాహుల్ గాంధీకి మాత్రం వెయ్యి కోట్లు సమర్పించుకుంటున్నారా?” అని ఆయన ప్రశ్నించారు.
ఇది రైతన్నల వెన్నుపోటు పొడవడమేనని, ‘రాహుల్ బంధు’ కాదు మాకు ‘రైతుబంధు’ కావాలని ఆయన డిమాండ్ చేశారు.
ఆరు గ్యారెంటీలు.. అన్నీ అబద్ధాలే!
వంద రోజుల్లో ఆరు గ్యారెంటీలకు చట్టబద్ధత కల్పిస్తామని చెప్పి రెండున్నరేళ్లు దాటినా అతీగతీ లేదని కేటీఆర్ విమర్శించారు. కేసీఆర్ హయాంలో నాట్లు వేసేటప్పుడే డబ్బులు పడేవని, ఇప్పుడు కోతలు వచ్చినా రైతుబంధు దిక్కులేదని మండిపడ్డారు.
నెలకు రూ. 2,500 ఇస్తామని మహిళలను, రూ. 4,000 పెన్షన్ ఇస్తామని వృద్ధులను కాంగ్రెస్ దారుణంగా వంచించిందని ధ్వజమెత్తారు. దళితబంధు స్థానంలో అంబేద్కర్ అభయహస్తం కింద రూ. 12 లక్షలు ఇస్తామన్న హామీ ఏమైందని నిలదీశారు.
ఆర్థిక అరాచకం – ఫైనాన్షియల్ మిస్ మేనేజ్మెంట్
తెలంగాణను వడ్డించిన విస్తరిలా అప్పగిస్తే, కాంగ్రెస్ ప్రభుత్వం ఆర్థిక అరాచకానికి తెరలేపిందని కేటీఆర్ ఆరోపించారు. “రిటైర్డ్ ఉద్యోగులకు కనీసం బెనిఫిట్స్ ఇవ్వలేని దుస్థితిలో రాష్ట్రం ఉందంటే దానికి కారణం ప్రభుత్వ అసమర్థతే” అని విమర్శించారు.
జాబ్ క్యాలెండర్ పేరుతో నిరుద్యోగులను, ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలతో విద్యార్థులను ప్రభుత్వం వేధిస్తోందని, ఈ బడ్జెట్ సమావేశాల్లో ప్రతి అంశంపై ప్రభుత్వాన్ని నిగ్గదీస్తామని ఆయన స్పష్టం చేశారు.
అమరవీరుల స్తూపం వద్ద బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ప్రభుత్వ వ్యతిరేక నినాదాలతో హోరెత్తించారు. ఆరు గ్యారెంటీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ సభలోకి వెళ్లారు.






