KTR News Latest | తెలంగాణలో విద్యారంగంపై కొనసాగుతున్న నేరపూరిత నిర్లక్ష్యానికి అద్దంపట్టే చిత్రం ఇది అంటూ బీఆరెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎక్స్ వేదికగా ఒక ఫోటోను షేర్ చేశారు. 12 మంది పిల్లలు, ఐదు పందులు అంటూ పిల్లలు లైన్లో నిల్చున్న చోటే పందులు తిరుగుతున్న దృశ్యాన్ని షేర్ చేశారు.
మహబూబ్నగర్ జిల్లా మూసాపేట మండలం వేములలో పూర్వప్రాథమిక పాఠశాలలో కొనసాగుతున్న అంగన్వాడీలో పందులు తిరుగాడుతుంటే, విద్యార్థులు బిక్కుబిక్కుమంటూ భోజనం కోసం లైన్లో నిలబడ్డారని పేర్కొన్నారు. కాంగ్రెస్ గద్దెనెక్కాక రెండేళ్లలో తెలంగాణ ప్రభుత్వ విద్యాసంస్థల్లో 102 ఫుడ్ పాయిజనింగ్ సంఘటనలు జరిగి 2188 పిల్లలు అసుపత్రుల పాలయ్యారని, వివిధ కారణాల వల్ల 118 మంది ముక్కుపచ్చలారని పిల్లలు చనిపోయారని తెలిపారు. ఇంత దారుణమైన పరిస్థితులు ఉన్నా రాష్ట్ర కాంగ్రెస్ సర్కారు మాత్రం మొద్దు నిద్ర వీడటం లేదని కన్నెర్ర చేశారు.









