Kangana Ranauth | హిమాచల్ ప్రదేశ్ లో భారీ వర్షాలతో వరదలు ముంచెత్తాయి. దీంతో రాష్ట్రవ్యాప్తంగా అనేక ప్రాంతాలు నీట మునిగాయి. కేవలం మండి జిల్లాలోనే 75 మంది మరణించినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో మండి ఎంపీ, సినీ నటి కంగనా రనౌత్ ఆదివారం తన నియోజకవర్గంలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు.
ఈ సందర్భంగా బాధితులతో మాట్లాడుతూ వారిని ఆదుకోవడానికి తన దగ్గర తక్షణమే ఇచ్చేందుకు విపత్తు నిధులు లేవనీ, తాను కేబినెట్ మంత్రిని కూడా కాదని వ్యాఖ్యానించారు. వరద బాధితుల కోసం కేంద్రం నుంచి ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించాలని కోరుతూ ప్రధాని మోదీకి లేఖ రాస్తానని హామీ ఇచ్చారు.
అయితే కంగన వ్యాఖ్యలపై కాంగ్రెస్ పార్టీ మండి పడింది. వరదల వల్ల సర్వం కోల్పోయిన ప్రజలను ఓదార్చాల్సింది పోయి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం వారిని మరింత బాధపెట్టడమేనని కాంగ్రెస్ నేతలు విమర్శించారు.
ఈ విమర్శలపై కంగన కూడా ఘాటుగా స్పందించారు. తన మాటలను కాంగ్రెస్ వక్రీకరించిందన్నారు. ఒక ఎంపీగా తాను ఏం చేయగలనో, తనకున్న పరిమితులేంటో ప్రజలకు స్పష్టంగా చెప్పానని తెలిపారు. నిధులు లేనప్పుడు ఆ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడం తన బాధ్యత అని చెప్పారు.
వరద బాధితులను ఆదుకోవడం మానేసి, రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం తన మాటలపై తప్పుడు ప్రచారం చేస్తోందని కంగన మండిపడ్డారు రాష్ట్ర ప్రభుత్వం బాధితులకు ఎలాంటి సహాయం చేయడం లేదని కూడా ఆమె ఆరోపించారు.