Kavitha New Party | తెలంగాణ జాగృతి (Telangana Jagrithi) అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత (Kalvakuntla Kavitha) బీఆరెస్ పార్టీ నుంచి బయటకు వచ్చిన తర్వాత తన రాజకీయ కార్యాచరణపై సీరియస్ గా దృష్టి పెట్టారు.
ఇటీవల తెలంగాణ జాగృతి జనం యాత్ర పేరుతో ప్రజల్లోకి వెళ్లారు. బీఆరెస్ నాయకులపై ఆరోపణలు చేశారు. ఈ నేపథ్యంలో ఆమె కొత్త రాజకీయ పార్టీ స్థాపించనున్నట్లు వార్తలు వచ్చాయి. తాజాగా ఆ ప్రయత్నాల్లో మరో కీలక ముందడుగు వేసినట్లు తెలుస్తోంది.
కవితకు ప్రముఖ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ సహకారం అందిస్తున్నట్లు సమాచారం. ఇటీవల రెండు నెలల వ్యవధిలో ప్రశాంత్ కిశోర్ రెండు సార్లు హైదరాబాద్కు వచ్చి కవితతో సమావేశమైనట్లు తెలుస్తోంది. సంక్రాంతి పండుగ సందర్భంగా కూడా ఇరువురి మధ్య కీలక చర్చలు జరిగినట్లు సమాచారం.
కొత్త పార్టీ ప్రకటిస్తే ఎదుర్కొవాల్సిన రాజకీయ పరిణామాలు, పార్టీని ప్రజల్లోకి ఎలా తీసుకెళ్లాలి, వ్యూహాత్మక నిర్ణయాలపై ఇద్దరూ విస్తృతంగా చర్చించినట్లు తెలుస్తోంది. తెలంగాణ జాగృతిని రాజకీయ వేదికగా మార్చి 2029 ఎన్నికల్లో ప్రజల ముందుకు తీసుకెళ్తామని ఇటీవల కవిత ప్రకటించిన విషయం తెలిసిందే.









