International red sanders smuggler Arrest | అంతర్జాతీయ ఎర్రచందనం స్మగ్లర్ మొహమ్మద్ ముజామిల్ ను ఎర్రచందనం అక్రమ రవాణా నిరోధక దళం అరెస్టు చేసింది. ఈ కింగ్ పిన్ ఎర్రచందనం దుంగలను లైసెన్స్ పేరు చెప్పి అక్రమంగా చైనాకి తరలించేవాడు. శేషాచలం నుంచి బెంగళూరు మీదుగా రవాణాకు పాల్పడేవాడు. ముజామిల్ మీద కేసులు ఉండగా, 87 శాతం కేసుల్లో శిక్షలు కూడా ఖరారయ్యాయి. అప్పటి నుంచి తప్పించుకుని తిరుగుతున్నాడు. కాగా ఎర్రచందనం అక్రమ రవాణాకి పాల్పడే వారి పట్ల ప్రభుత్వం నిర్ధయగా వ్యవహరిస్తుందని, కింగ్ పిన్స్ ఎవరైనా ఉంటే లొంగిపోవాలని గత చిత్తూరు జిల్లా పర్యటనలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ హెచ్చరించిన విషయం తెల్సిందే.
కింగ్ పిన్స్ ఏ మూలన దాగి ఉన్నా పట్టుకోవాలని ఆయన అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అప్పటి నుంచి ఓ ప్రత్యేక ఆపరేషన్ మొదలుపెట్టిన యాంటి రెడ్ శాండర్స్ స్మగ్లింగ్ టాస్క్ ఫోర్స్ బృందం గాలింపు చేపట్టి మొదటి విజయం సాధించింది. ఈ వేటలో భాగంగా శనివారం ఉదయం చిత్తూరు – నాయుడుపేట జాతీయ రహదారిపై అడిషనల్ ఎస్పీ కులశేఖర్ ఆధ్వర్యంలోని బృందం ముజామిల్ ను పట్టుకుంది. ఇతనికి చైనాలోని జైమెన్ టాంగాంగ్ ఫాంగ్ ట్రేడ్ కంపెనీతో సంబంధాలు ఉన్నట్టు విచారణలో తేలింది. ఈ నేపథ్యంలో ప్రత్యేక బృందం అధికారులను ఉప ముఖ్యమంత్రి అభినందించారు.









