India Confirms Secret Operation Along Myanmar Border | గతేడాది జులైలో సరిహద్దు వెంట మయన్మార్ లో నక్కిన ఉగ్రవాదులే లక్ష్యంగా భారత సైన్యం ఓ రహస్య ఆపరేషన్ చేపట్టింది. అయితే ఈ ఆపరేషన్ పై భారత ప్రభుత్వం అప్పట్లో ఎలాంటి ప్రకటన చేయలేదు. కానీ గణతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రకటించిన శౌర్యచక్ర పురస్కారంతో ఈ ఆపరేషన్ వెలుగులోకి వచ్చింది. 21వ పారా స్పెషల్ ఫోర్స్ కు చెందిన లెఫ్టినెంట్ కల్నల్ ఘటాగే ఆదిత్య శ్రీకుమార్ కు భారత ప్రభుత్వం శౌర్యచక్ర పురస్కారాన్ని ప్రకటించింది. మయన్మార్ లో భారత వ్యతిరేక కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఉగ్రసంస్థ లక్ష్యంగా అత్యంత ఖచ్చితత్వంతో రహస్య ఆపరేషన్ ను నిర్వహించినందుకు గాను ఆదిత్య శ్రీకుమార్ కు శౌర్యచక్ర పురస్కారం ప్రకటిస్తున్నట్లు కేంద్రం వెల్లడించింది. కాగా అస్సాం రాష్ట్రానికి స్వయం ప్రతిపత్తి డిమాండ్ చేస్తూ యునైటెడ్ లిబరేషన్ ఫ్రంట్ ఆఫ్ అస్సాం ఉల్ఫా(ఐ) ఉగ్రసంస్థ భారత్-మయన్మార్ సరిహద్దు వెంట నక్కి ఉగ్ర కార్యకలాపాలు నిర్వహిస్తోంది.
ఈ క్రమంలో గతేడాది జులై నెలలో లెఫ్టినెంట్ కల్నల్ ఆదిత్య శ్రీకుమార్ నేతృత్వంలో ఓ భారీ రహస్య ఆపరేషన్ జరిగినట్లు తెలుస్తోంది. ప్రణాళికబద్ధంగా, ఖచ్చితత్వంతో ఉగ్రవాద స్థావరాలే లక్ష్యంగా సైన్యం మయన్మార్ లోని సగైoగ్ ప్రాంతంలో డ్రోన్లు, క్షిపణి దాడుల్లో 9 మంది ఉగ్రవాదులు మరణించినట్లు అప్పట్లో కథనాలు వచ్చాయి. తమ సంస్థకు చెందిన తొమ్మిది మంది నాయకులు మృతి చెందినట్లు ఉల్ఫా ఐ ఉగ్రసంస్థ కూడా ప్రకటించింది. అయితే ఈ ఆపరేషన్ పై అప్పట్లో కేంద్రం ఎలాంటి ప్రకటన చేయలేదు. కానీ తాజాగా శౌర్యచక్ర అవార్డు ప్రకటనతో ఈ ఆపరేషన్ ను ధృవీకరించినట్లు అవుతుంది. ఈ ఆపరేషన్ కు సంబంధించిన పూర్తి వివరాలను కేంద్రం వెల్లడించలేదు. కేవలం దేశానికి వ్యతిరేకంగా పనిచేస్తున్న ఉగ్రవాదులను లక్ష్యం చేసుకుని ఈ ఆపరేషన్ చేపట్టినట్లు కేంద్రం పేర్కొంది.










