Deputy Cm Pawan Kalyan News | అటవీ భూములను ఇష్టానుసారం ఆక్రమించేవారిని ప్రభుత్వం ఉపేక్షించదని ప్రజలకు సంబంధించిన ఆస్తులు, జాతికి సంబంధించిన ఆస్తులపై కన్నేసే వారిపై నిఘా ఉంచుతామని పేర్కొన్నారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్.
పుంగనూరు నియోజకవర్గం, పులిచెర్ల మండలం, మంగళంపేటలో మాజీ మంత్రి, వైసీపీ నేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మరియు ఆయన కుటుంబసభ్యుల చేతిలో సుమారు 104 ఎకరాల అటవీ భూముల ఉన్నాయని తెలుపుతూ అటవీ శాఖ ఉన్నతాధికారులతో పవన్ కళ్యాణ్ టెలీ కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. రాష్ట్ర సచివాలయంలో సోమవారం జరిగిన మంత్రివర్గ సమావేశంలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆయన కుటుంబసభ్యులు అటవీ భూముల ఆక్రమణలు చేశారని ఈ మేరకు తన వద్ద నివేదికలు, వీడియోలు, ఇతర సమాచారం ఉన్నాయని ముఖ్యమంత్రి, సహచర మంత్రుల వద్ద పవన్ కళ్యాణ్ ప్రస్తావించారు.
త్వరలోనే అన్ని వివరాలతో ఆక్రమణ విషయాన్ని వెల్లడిస్తానని చెప్పారు. భూమి రిజిస్ట్రేషన్ రికార్డుల ప్రకారం 45.80 ఎకరాలు వాళ్ళ అధీనంలో ఉంటే, వెబ్ ల్యాండ్ లోకి వచ్చేసరికి ఆ భూమి 77.54 ఎకరాలుగా చూపారని పవన్ తెలిపారు. మాజీ అటవీ శాఖ మంత్రి కుటుంబానికి అడవి మధ్యలో ఉన్న భూమి వారసత్వంగా వచ్చిందని చెబుతున్నారని అసలు అడవి మధ్యలో వారసత్వ భూమి ఎలా వచ్చింది, ఈ భూమి ఎలా ఎప్పుడు చేతులు మారిందనేది తెలుసుకోవాలని అధికారులకు స్పష్టం చేశారు. ఈ క్రమంలో ఇటీవల చిత్తూరు జిల్లాలో పర్యటించిన సమయంలో ఏరియల్ సర్వే నిర్వహించిన పవన్ పెద్దిరెడ్డి ఆక్రమించారని ఆరోపిస్తున్న భూములను వీడియో తీశారు.










