CM Revanth Reddy Meets BC Leaders | బీసీ కుల గణన ఒక సాహసోపేత నిర్ణయమన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. త్రికరణ శుద్ధిగా లెక్కతేల్చామని స్పష్టం చేశారు.
రాహుల్ గాంధీ ఆదేశాలే తాను పాటించినట్లు కులగణనపై సీఎం వ్యాఖ్యానించారు. ఈ మేరకు బీసీ నేతలతో శనివారం సమావేశమయ్యారు. తప్పుడు లెక్క అనేవారిది తప్పుడు మాటని, బీసీల లెక్కతేలితే నష్టపోయే రాజకీయ శక్తులే దీనిని వ్యతిరేకిస్తున్నాయన్నారు.
తప్పుడు లెక్కలు అని ముద్రవేసి బీసీలకు చారిత్రక ద్రోహం చేసే కుట్ర చేస్తున్నారని హెచ్చరించారు. కుల గణన బీసీలకు ప్రజా ప్రభుత్వం ఇచ్చిన ఆస్తి అని, ఈ ఆస్తిని కాపాడుకోవాల్సిన బాధ్యత బీసీలదే, రాజకీయ ప్రేరేపితానికి లోనైతే బీసీలు శాశ్వతంగా నష్టపోతారని ముఖ్యమంత్రి పేర్కొన్నారు.
బీసీలు సొంతం చేసుకోకపోతే ఈ లెక్కలు పట్టాలెక్కవు, కుట్రలను ఛేదించకపోతే బీసీలు శాశ్వతంగా నష్టపోతారని చెప్పారు. మంచి చేసిన తననే రాళ్లతో కొడదామనుకుంటే నష్టపోయేది బీసీలే అన్నారు. కుల గణన వ్యతిరేకిస్తున్న వాడిని వదిలేసి… బీసీ లెక్కలు తేల్చిన తమపై ఆరోపణలు చేస్తే కూర్చున్న కొమ్మను నరుక్కున్నట్టేనన్నారు.
కులగణన లెక్కలకు చట్టబద్ధత కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా ‘బీసీ మిత్రులకు నా విజ్ఞప్తి. మీ కోసం నేను నా శక్తి మేరకు సాహసం చేశా. దీనిని సొంతం చేసుకోవాల్సిన బాధ్యత మీదే.’ అంటూ సీఎం పిలుపునిచ్చారు.