– స్పీకర్, సీఎం రేవంత్లపై బండి ఆగ్రహం!
Bandi Sanjay Kumar | తెలంగాణ శాసనసభలో గవర్నర్ ప్రసంగం అనంతరం ‘వందేమాతరం’ గేయాలాపన సమయంలో ఎంఐఎం (MIM) ఎమ్మెల్యేలు వాకౌట్ చేయడంపై రాజకీయ దుమారం రేగుతోంది.
ఈ ఉదంతంపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. సభలో రాజ్యాంగ ఉల్లంఘన జరుగుతుంటే స్పీకర్, ముఖ్యమంత్రి ఎందుకు మౌనంగా ఉన్నారని ఆయన నిలదీశారు.
రాజ్యాంగబద్ధ పదవుల్లో ఉండి ప్రేక్షక పాత్రేంటి?
“వందేమాతరం గేయం ఆలపించేటప్పుడు సభ్యులంతా గౌరవప్రదంగా నిలబడాలన్న కనీస నిబంధన తెలియదా?” అని బండి సంజయ్ ప్రశ్నించారు.
రాజ్యాంగ పరిరక్షకులైన గవర్నర్, స్పీకర్, మండలి చైర్మన్ సాక్షిగా జాతీయ గేయానికి అవమానం జరిగినా చర్యలు తీసుకోకపోవడం సిగ్గుచేటని మండిపడ్డారు.
2026లోనే కేంద్ర ప్రభుత్వం రాష్ట్రపతి, గవర్నర్ అధికారిక కార్యక్రమాల్లో ‘వందేమాతరం’ తప్పనిసరి చేస్తూ ఉత్తర్వులు ఇచ్చిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు.
కాంగ్రెస్-మజ్లిస్ ‘దోస్తీ’పై విమర్శలు
మజ్లిస్ నేతలకు ఇంతవరకు ఎందుకు నోటీసులు ఇవ్వలేదని ప్రశ్నిస్తూ.. “కాంగ్రెస్ పార్టీకి మజ్లిస్ దోస్త్ కాబట్టి నోటీసులు ఇవ్వడానికి భయపడుతున్నారా?” అని ఎద్దేవా చేశారు.
రాహుల్ గాంధీ నిత్యం రాజ్యాంగ పుస్తకాన్ని పట్టుకుని తిరుగుతారని, కానీ ఆయన పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రంలో మాత్రం రాజ్యాంగ ఉత్తర్వులను తుంగలో తొక్కుతున్నారని విమర్శించారు.
ఫిరాయింపుల విషయంలో స్పీకర్ తీర్పుతో ఇప్పటికే శాసన వ్యవస్థపై నమ్మకం సడలిందని, ఇప్పుడు ఈ ఘటనతో అది మరింత బలపడిందని ఆరోపించారు.
తక్షణ చర్యలకు డిమాండ్
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు సభలో ఉండగానే ఈ ఉల్లంఘన జరగడంపై బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
కేంద్ర ప్రభుత్వ ఉత్తర్వులను బేఖాతరు చేస్తూ, జాతీయ చిహ్నాలను అవమానించిన ఎంఐఎం ఎమ్మెల్యేలపై తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ మేరకు స్పీకర్ వెంటనే ఆదేశాలు జారీ చేయాలని స్పష్టం చేశారు.










