AP High Court | మతం మారిన తర్వాత కులం వర్తింపునకు సంబంధించి ఏపీ హైకోర్టు (AP High Court) ఓ కీలక తీర్పు వెలువరించింది. షెడ్యూల్డ్ కులాల వ్యక్తులు క్రైస్తవంలోకి మారిన రోజే ఎస్సీ హోదాను కోల్పోతారని తేల్చిచెప్పింది. అలా మారిన వారు ఎస్సీ, ఎస్టీ చట్టం నుంచి రక్షణ పొందలేరని స్పష్టంచేసింది.
చర్చి పాస్టర్ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద పలువురిపై నమోదైన కేసును కొట్టేయాలని ఆదేశించింది. వివరాల్లోకి వెళితే తనను కులం పేరుతో దూషించి, దాడి చేశారంటూ ఉమ్మడి గుంటూరు జిల్లాకు చెందిన పాస్టర్ చింతాడ ఆనంద్ 2021లో చందోలు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
దీంతో గ్రామానికి చెందిన ఎ. రామిరెడ్డితోపాటు మరో ఐదుగురిపై ఎస్సీ, ఎస్టీ చట్టంతోపాటు ఐపీసీ సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. గుంటూరు ఎస్సీ, ఎస్టీ కోర్టులో ఈ కేసు విచారణ పెండింగ్ లో ఉంది. అయితే కేసును కొట్టేయాలంటూ నిందితులు 2022లో హైకోర్టులో పిటిషన్ వేశారు.
ఫిర్యాదు దారు పదేళ్లుగా పాస్టర్ గా పనిచేస్తున్నారనీ, క్రైస్తవంలోకి మారిన వ్యక్తికి ఎస్సీ, ఎస్టీ చట్టం వర్తించదని నిందితుల తరఫు న్యాయవాది కోర్టుకు వివరించారు. రాజ్యాంగం (షెడ్యూల్డ్ కులాలు) ఆర్డర్-1950 ప్రకారం హిందూమతాన్ని కాకుండా ఇతర మతాలను స్వీకరించినవారు ఎస్సీ హోదాను కోల్పోతారనీ, కులవ్యవస్థను క్రైస్తవం గుర్తించదని, ఆ మతాన్ని స్వీకరించిన వారికి ఎస్సీ, ఎస్టీ చట్టం కింద రక్షణ ఉండదని సుప్రీంకోర్టు తీర్పులు ఇచ్చిన విషయాన్ని గుర్తు చేశారు.
వీటిని పరిగణనలోకి తీసుకుని కేసును కొట్టేయాలని కోరారు. పిటిషనర్ల తరపు న్యాయవాది వాదనలతో ఏకీభవించిన న్యాయమూర్తి.. ‘ఎస్సీ, ఎస్టీ చట్టం కింద ఫిర్యాదుదారుడు రక్షణ పొందలేరనీ, నిందితులపై ఐపీసీ కింద నమోదు చేసిన సెక్షన్లు చెల్లుబాటు కావని తీర్పులో పేర్కొన్నారు.