Interesting Facts About Gandhi | “ఈ ప్రపంచానికి నేను కొత్తగా చెప్పడానికి ఏం లేదు. సత్యం, అహింస అనేవి ఈ భూమి మీద పర్వతాల మాదిరిగానే అతి పురాతన మైనవే” – మహాత్మా గాంధీ
నిజమే బాపూ ఈ ప్రపంచానికి కొత్తగా ఏం నేర్పలేదు. ఈ భూమి మీద ఉన్న జంతువుల్లో విచక్షణ ఉన్న ఏకైక జీవి అయిన మనిషికి ఉండాల్సిన గుణాలు, అనుసరించాల్సిన మార్గాలను మానవుడికి గుర్తు చేశారు.
స్వయంగా ఆయనే అనుసరించి ప్రపంచానికే ఆదర్శంగా నిలిచారు. యుద్ధాలు చేసి.. రక్తం ఏరులై పారించి రాజ్యాలను గెలిచే సంస్కృతికి చరమగీతం పాడారు.
సత్యం, అహింస అనే కంటికి కనిపించని ఆయుధాలతో శత్రువును గెలిచారు. భారతీయులను బానిసత్వపు సంకెళ్ల నుంచి విముక్తి చేయడమే కాదు.. శత్రువుకు కూడా పాఠాలు నేర్పించారు.
Read Also: Operation ROPE: హైదరాబాద్లో కొత్త ట్రాఫిక్ రూల్స్.. ఉల్లంఘిస్తే జేబుకు చిల్లే!
మహాత్ముడి (Mahatma Gandhi) జీవితం ఓ తెరిచిన పుస్తకం. ఆయన రాసుకున్న ఆత్మకథే దీనికి ఓ నిదర్శనం.
తన జీవితంలో ఎదురైన అన్ని సంఘటనలను.. ఆయన చేసిన తప్పొప్పులను సైతం.. నిర్మొహమాటంగా.. నిష్పక్షపాతంగా ఎలాంటి దాపరికాలు లేకుండా ప్రపంచం ముందు ఉంచారు.
గాంధీ ఆలోచనలను ఆచరించే వారికి, ఆయన సిద్ధాంతాలను అనుసరించే వారికి మహాత్ముడికి సంబంధించిన ఏ చిన్న విషయమైనా తెలుసుకోవాలనే కుతూహలం ఉంటుంది.
బాపూజీ 153 వ జయంతి సందర్భంగా ఆయన గురించి నేటి తరానికి తెలియని కొన్ని ఆసక్తికర విషయాలు.. (Interesting Facts About Gandhi)
- గాంధీజీ ఒకసారి రైలు ఎక్కే సమయంలో ఆయన షూ జారి రైల్వే ట్రాక్ పడిపోయింది. దాన్ని తీసుకునే అవకాశం లేకపోవడంతో వెంటనే తన రెండో షూ కూడా మొదటిది పడిపోయిన దగ్గరకి విసిరేశారట. ఎందుకో ఊహించారా? షూ తనకు ఎలాగూ ఉపయోగపడదు. రెండూ ఒకే చోట ఉంటే.. కనీసం అవి దొరికినవారికైనా ఉపయోగపడతాయి కదా అనేది మహాత్ముడి ఉద్దేశం. చిన్న చిన్న విషయాలపట్ల కూడా మహాత్ముడు ఎలా ఆలోచిస్తారో నిదర్శనం ఈ సంఘటన.
- బాపూజీ స్వయంగా రాసుకున్న తన జీవిత కథ సత్యశోధన లేదా ఆత్మకథ పుస్తకం గురించి తెలుసు కదా. ఈ పుస్తకం 1927లో ప్రచురితమైంది. అయితే 1999లో హార్పర్ కొల్లిన్స్ పబ్లిషర్స్ అనే సంస్థ ప్రకటించిన 20 శతాబ్దపు 100 అంత్యత ప్రభావంతమైన ఆధ్యాత్మిక గ్రంథాల జాబితాలో బాపూ ఆత్మకథకు కూడా స్థానం కల్పించింది.
- టైమ్స్ మ్యాగజీన్ 1999లో 20వ శతాబ్దపు పర్సన్ ఆఫ్ ది ఈయర్ కోసం 100 మంది అత్యంత ప్రభావవంతమైన వ్యక్తుల జాబితాను ప్రకటించింది. అందులో గాంధీజీ రెండో స్థానంలో నిలిచారు. అప్పటికే సైన్స్ అండ్ టెక్నాలజీ ప్రపంచాన్ని శాసిస్తుండటంతో ప్రముఖ శాస్త్రవేత్త ఐన్స్టీన్ ను పర్సన్ ఆఫ్ ది సెంచరీగా ఎంపిక చేసింది.
- భారతీయుల ఆర్థిక, సామాజిక దుస్థితి కారణంగానే గాంధీజీ పూర్తి దుస్తులు వేసుకోవడం మానేశారని మనందరికీ తెలుసు. కానీ ఎక్కడ, ఎప్పుడు ఆ నిర్ణయం తీసుకున్నారో తెలుసా? 1921లో బాపూ మధురైలో పర్యటిస్తున్నప్పుడు చాలా మంది కేవలం ఒక ధోవతితోనే కనిపించారట. దీంతో అప్పటి నుంచి అదే ఆయన వేషధారణ అయింది.
Read Also: రాజమౌళి సినిమాలో నటించలేనన్న చిరంజీవి.. కారణం ఏంటంటే!
- (Interesting Facts About Gandhi)మనకి 1947 ఆగస్టు 15న స్వాతంత్య్రం సిద్ధించిన విషయం విదితమే! కానీ, ఆ సమయంలో బాపూ ఏం చేస్తున్నారో తెలుసా? దేశమంతా స్వాతంత్య్ర సంబరాల్లో మునిగి తేలుతుంటే.. ఇండియా పాకిస్తాన్ దేశ విభజన సందర్భంగా జరిగిన విధ్వసం.. అల్లర్లకు నిరసనగా బాపూ నిరాహార దీక్షకు పూనుకున్నారు. స్వాతంత్య్రం సిద్ధించిన ఆనందం కూడా ఆయన జరుపుకోనేలేదు.
- ప్రపంచంలో ఎందరో నాయకులను, దేశాలను ప్రభావితం చేసిన బాపూజీ రెండు విషయాల పట్ల మాత్రం అసంతృప్తిగా ఉండేవారట. అందులో ఒకటి తన చేతిరాత. ఆయన హ్యాండ్ రైటింగ్ అస్సలు బాగుండదని మహాత్ముడి భావన. రెండోది బాడీ మసాజ్. గాంధీజీ బాడీ మసాజ్ని చాలా ఆస్వాదించేవారట.
- గూగుల్లో గాంధీ అనే పేరు టైప్ చేయగానే కొన్ని వందల సంఖ్యలో మహాత్ముడి ఫోటోలు దర్శనమిస్తాయి కదా! అయితే అసలు బాపూజీకి ఫొటోలు తీసుకోవడం అస్సలు నచ్చదట. కానీ, ఆ సమయంలో ఎక్కువ ఫొటోల్లో కనిపించిన వ్యక్తి ఆయనే.
- దేశానికి స్వాతంత్య్రం సాధించడానికి మహాత్ముడు అనుసరించిన మార్గం ప్రపంచం మొత్తాన్ని ప్రభావం చేసిందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఆయన పోరాటం ఎంతలా ప్రభావం చేసిందంటే.. 12 దేశాల్లో పౌర హక్కుల ఉద్యమాలకు గాంధీజీయే స్ఫూర్తి.
- ఆఖరికి మహాత్ముడి హత్యానంతరం నిర్వహించిన అంతిమయాత్ర కూడా అప్పట్లో ఓ రికార్డు సృష్టించింది. కొన్ని వేలమంది దేశ ప్రజలు బాపూ అంతిమ యాత్రలో పాల్గొన్నారు. దీంతో అది ఏకంగా 8 కిలోమీటర్లు సాగింది. మరో విషయం ఏంటంటే.. 1948లో మహాత్ముడి అంతిమయాత్రకు ఉపయోగించిన బండినే 1997లో మదర్ థెరిసా అంతిమ యాత్రకు కూడా ఉపయోగించారు.
- గాంధీజీ జాతికి అందించిన సేవలను దేశం మొత్తం గుర్తుంచుకుంటుంది. ఆయన స్మృతికి చిహ్నంగా దేశవ్యాప్తంగా దాదాపు 53 ప్రధాన రహదారులకు గాంధీ పేరునే పెట్టారు. ఇవే కాకుండా చిన్న చిన్న రోడ్లు అదనం. మనదేశానికి బయట కూడా వివిధ దేశాల్లో బాపూ పేరుతో మరో 48 రోడ్లు ఉన్నాయట.
- డిజిటల్ రంగంలో ప్రపంచాన్ని శాసిస్తున్న ఆపిల్ కంపెనీ ఫౌండర్ స్టీవ్ జాబ్స్ గురించి తెలుసు కదా. ఆయన మహాత్ముడికి వీరాభిమాని. స్టీవ్.. మహాత్ముడికి గుర్తుగానే గుండ్రని కళ్లజోడు ధరించేవాడు.
- ఆంగ్లేయులు మన దేశాన్ని వదిలి వెళ్లిపోవడానికి ముఖ్య కారకుల్లో గాంధీ ఒకరు. బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పోరాటం చేశారు. అయితే, అదే బ్రిటన్ గాంధీ మరణించిన 21 ఏళ్ల తర్వాత ఆయణ్ని గౌరవిస్తూ ఓ ప్రత్యేక స్టాంపుని విడుదల చేసింది.
Read Also: Hyderabad సినీ సిగలో మరో మణిహారం..!
- 1959లో గాంధీ మెమోరియల్ మ్యూజియం స్థాపించారు. ఇది తమిళనాడులోని మధురై నగరంలో ఉంది. దీనిని గాంధీ మ్యూజియం అని కూడా అంటారు. నాథూరామ్ గాడ్సే హత్య చేసినప్పుడు మహాత్మాగాంధీ ధరించిన రక్తపు మరకల దుస్తులు ఇప్పటికీ అందులో ఉన్నాయి.
- భారతీయులు మహాత్మా గాంధీని జాతిపితగా పిలుచుకుంటారు. అయితే తొలిసారి గాంధీని జాతిపితగా అభివర్ణించింది సుభాష్ చంద్రబోస్. స్వాతంత్య్రోద్యమంలో బాపూజీ, నేతాజీ మార్గాలు పరస్పరం విభిన్నం.
ఆజాద్ హింద్ ఫౌజ్ అనే సొంత సైన్యాన్ని సిద్ధం చేసుకుని బ్రిటీష్ ఇండియాపై యుద్ధానికి దిగిన నేతాజీ సుభాష్ చంద్రబోస్ తొలిసారి గాంధీజీని జాతిపిత అని పిలిచారు. జూలై 6, 1944 న నేతాజీ సింగపూర్ నుంచి రేడియో ద్వారా పంపిన సందేశంలో గాంధీజీని జాతిపిత అని పిలిచారు.
కాబట్టి, ఇక అప్పటినుంచి ఆయన్ని అందరూ జాతిపితగా గౌరవించడం మొదలు పెట్టారు. అయితే ఇది భారతీయుల వాడుకలో ఉంది కానీ భారత ప్రభుత్వం ఎక్కడా అధికారిక ప్రకటన ఇవ్వలేదు.