Bandi Sanjay Slams CM Revanth | తెలంగాణలోని కాంగ్రెస్ (Congress Government) ప్రభుత్వంపై కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ (Bandi Sanjay Kumar) తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ముఖ్యమంత్రికి ప్రజా సంక్షేమం కంటే ‘డూప్లికేట్ గాంధీ కుటుంబాన్ని ప్రసన్నం చేసుకోవడమే పరమావధిగా మారిందని విమర్శించారు.
పదవులు కాపాడుకోవడానికి ఢిల్లీకి రూ.వెయ్యి కోట్ల నిధులు పంపే అంశంపైనే కేబినెట్లో చర్చిస్తున్నారా? అని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో మహిళలకు నెలకు రూ.2500, అవ్వాతాతలకు రూ.4 వేల పెన్షన్, నిరుద్యోగ భృతి వంటి హామీలు ఎందుకు అమలు చేయడం లేదని ప్రశ్నించారు.
రూ.5 లక్షల భరోసా కార్డులు ఏమయ్యాయి? ఫీజు రీయంబర్స్ మెంట్ బకాయిలు ఇవ్వకపోవడంతో విద్యార్థులు, యాజమాన్యాలు అల్లాడుతున్నాయని మండిపడ్డారు.
రిటైర్డ్ ఉద్యోగుల బెనిఫిట్స్ చెల్లించకపోవడంతో 61 మంది చనిపోయినా ప్రభుత్వంలో చలనం లేదని, 5 డీఏలు, బకాయిల కోసం ఉద్యోగులు ఎదురుచూస్తున్నారని పేర్కొన్నారు.
బకాయిలు చెల్లించక ప్రైవేట్ ఆసుపత్రుల్లో చికిత్స అందక పేదలు అరిగోస పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.కాంగ్రెస్ ఐదేళ్ల పాలనలో సగం కాలం పూర్తయినా, మేనిఫెస్టోలోని హామీల్లో 10 శాతం కూడా అమలు చేయలేదని సంజయ్ విమర్శించారు.
వెంటనే 6 గ్యారంటీలు, 420 హామీల అమలు తేదీని ప్రకటించాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు నాయకత్వంలో ప్రభుత్వం మెడలు వంచి తీరుతామని, పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు.










