TSRTC Free Ride For Women | నూతనంగా ఏర్పాటైన తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారంటీలను ప్రకటించిన విషయం తెల్సిందే. కాగా ఇందులో భాగమైన మహాలక్ష్మి పథకం కింద ఉన్న మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం అమల్లోకి రాబోతుంది.
కాగా సోనియా గాంధీ జన్మదినం సందర్భంగా డిసెంబర్ 9న ఈ పథకాన్ని ప్రారంభించనుంది కాంగ్రెస్ ప్రభుత్వం. ఈ మేరకు శుక్రవారం సాయంత్రం ఆర్టీసీ ఎండీ సజ్జనార్ మీడియాతో మాట్లాడుతూ కీలక ప్రకటన చేశారు.
శనివారం ఉదయం తొలుత సీఎం రేవంత్ రెడ్డి, మహిళ మంత్రులతో అసెంబ్లీ ప్రాంగణంలో ఈ పథకాన్ని ప్రారంభించనున్నట్లు తెలిపారు. శనివారం మధ్యాహ్నం నుండి పల్లె వెలుగు, ఎక్స్ ప్రెస్ బస్సుల్లో బాలికలు, మహిళలు, ట్రాన్స్ జెండర్స్ ఉచితంగా ప్రయాణించవచ్చని తెలిపారు.
జిల్లాల్లో పల్లె వెలుగు, ఎక్స్ ప్రెస్ బస్సుల్లో, నగరాల్లో అయితే సిటీ ఆర్డినరీ, సిటీ మెట్రో బస్సుల్లో ఉచితంగా ప్రయాణం చేయవచ్చు. తెలంగాణకు చెందిన వారు మాత్రమే కేంద్ర, లేదా రాష్ట్ర ప్రభుత్వాలు జారీ చేసినా ఏదైనా ఒక కార్డు చూపించి ప్రయాణించొచ్చని చెప్పారు.
ఇతర రాష్ట్రాలకు వెళ్లే టీఎస్ ఆర్టీసీబస్సుల్లో తెలంగాణ సరిహద్దుల వరకు ఉచితం. ఆ తర్వాత రాష్ట్రం దాటితే టికెట్ తీసుకోవాల్సి ఉంటుంది.