Telangana-High Court Order On Activists’ Pension | స్వరాష్ట్ర సాధన కోసం ప్రాణ త్యాగానికి సైతం తెగించి పోరాడిన తెలంగాణ ఉద్యమకారుల దశాబ్దాల నిరీక్షణకు తెరపడే సమయం ఆసన్నమైంది.
ప్రభుత్వం మారినా తమ బతుకులు మారలేదని ఆవేదన చెందుతున్న ఉద్యమకారులకు తెలంగాణ హైకోర్టు తీపి కబురు అందించింది.
కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయడంలో జాప్యం చేయడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్పై కోర్టు కీలక తీర్పు వెలువరించింది.
తెలంగాణ ఉద్యమకారులకు పెన్షన్లు, ఇళ్ల స్థలాలు ఇస్తామని ప్రకటించిన ప్రభుత్వం, ఆ దిశగా చర్యలు తీసుకోకపోవడంతో ఉద్యమ జేఏసీ నాయకులు హైకోర్టును ఆశ్రయించారు.
పిటిషనర్ల తరపున న్యాయవాది జి. కరుణాకర్ రెడ్డి బలమైన వాదనలు వినిపించారు. ఉద్యమకారుల త్యాగాలను గుర్తించి వారికి రావాల్సిన ఫలాలను త్వరితగతిన అందించాలని కోరారు.
ఇరుపక్షాల వాదనలు విన్న హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ విజయసేన్ రెడ్డి సంచలన ఆదేశాలు జారీ చేశారు.
‘అభయహస్తం’ పథకం కింద దరఖాస్తు చేసుకున్న ఉద్యమకారులందరికీ ఎనిమిది వారాల (రెండు నెలల) వ్యవధిలో ఇళ్ల స్థలాలు, పెన్షన్లు మంజూరు చేయాలని స్పష్టం చేశారు.
ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రిన్సిపాల్ సెక్రెటరీకి మరియు ఫ్రీడమ్ ఫైటర్ శాఖకు ఆదేశాలు జారీ చేశారు.









