- జీఎంఆర్, ఫిక్కీలతోప్రభుత్వం కీలక ఒప్పందాలు!
అనాథ పిల్లల జీవితాల్లో వెలుగులు నింపే దిశగా తెలంగాణ ప్రభుత్వం మరో ముందడుగు వేసింది. ప్రభుత్వ సంరక్షణలో పెరుగుతున్న అనాథ యువతకు ఉపాధి, నైపుణ్య శిక్షణ కల్పించే లక్ష్యంతో రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ శాఖ కీలక ఒప్పందాలు కుదుర్చుకుంది.
సచివాలయంలో మంత్రి సీతక్క సమక్షంలో జీఎంఆర్ (GMR) ఎయిర్పోర్ట్ అథారిటీ, ఫిక్కీ (FICCI), అజీమ్ ప్రేమ్జీ యూనివర్సిటీ ప్రతినిధులతో ఈ అవగాహన ఒప్పందాలు జరిగాయి. ఈ ఒప్పందంలో భాగంగా, ప్రభుత్వ సంరక్షణలో ఉన్న యువతకు విమానయాన రంగంలో అంతర్జాతీయ స్థాయి శిక్షణ లభించనుంది.
శంషాబాద్లోని జీఎంఆర్ ఏరో అకాడమీలో 2026 మార్చి నుండి ఈ కార్యక్రమం ప్రారంభం కానుంది. ఎయిర్పోర్ట్ ఆపరేషన్స్, కార్గో, గ్రౌండ్ హ్యాండ్లింగ్ వంటి విభాగాల్లో దశలవారీగా శిక్షణ ఇస్తారు.శిక్షణ పూర్తి చేసుకున్న యువతకు ప్రైవేట్ మరియు అంతర్జాతీయ విమానయాన సంస్థల్లో ఉద్యోగ అవకాశాలు కల్పించడం.
పాలిటెక్నిక్ చదువుతున్న అనాథ అమ్మాయిల కోసం ఫిక్కీ (FICCI) ప్రత్యేక శిక్షణా కార్యక్రమాలను చేపట్టనుంది. చదువుకునే కాలంలోనే పరిశ్రమలకు అవసరమైన టెక్నికల్ స్కిల్స్ (Industry Training) మరియు సాఫ్ట్ స్కిల్స్పై శిక్షణ ఇస్తారు. శక్తి సదన్లలో ఉంటున్న యువతకు ఉపాధి అవకాశాలే లక్ష్యంగా ఈ కార్యక్రమం రూపుదిద్దుకుంది.
చిన్నారులకు మెరుగైన విద్యను అందించే క్రమంలో అంగన్వాడీ టీచర్ల నైపుణ్యాన్ని పెంచేందుకు అజీమ్ ప్రేమ్జీ యూనివర్సిటీతో ఒప్పందం కుదిరింది. టీచర్లకు ప్రి-స్కూల్ ట్రైనింగ్తో పాటు ఇంగ్లీష్ భాషపై పట్టు సాధించేలా శిక్షణ ఇస్తారు.
అంగన్వాడీ కేంద్రాల్లో చిన్నారులకు అందించాల్సిన సేవలపై శాస్త్రీయ పద్ధతులను నేర్పిస్తారు. అనాథ పిల్లల సంరక్షణ ప్రభుత్వ బాధ్యత. వారికి కేవలం ఆశ్రయం కల్పించడమే కాదు, వారి కాళ్ల మీద వారు నిలబడేలా భవిష్యత్తును అందించడమే మా లక్ష్యం.
పరిశ్రమలతో భాగస్వామ్యం ద్వారా వారిని ఉన్నత శిఖరాలకు చేరుస్తాం.” అని మంత్రి సీతక్క ఈ సందర్భంగా తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం అనాథ పిల్లల పునరావాసం మరియు మహిళా సాధికారత దిశగా ఒక మార్గదర్శక ముందడుగు అని మంత్రి అభివర్ణించారు.









