Actress Saroja Devi Passes Away | సీనియర్ నటి, పద్మభూషణ్ పురస్కార గ్రహీత బి. సరోజాదేవి (B. Saroja Devi) కన్నుమూశారు. బెంగళూరులోని తన నివాసంలో సోమవారం ఉదయం ఆమె తుదిశ్వాస విడిచారు. ఎన్టీఆర్, ఏఎన్నార్, ఎంజీఆర్ వంటి దిగ్గజ నటులతో తెలుగు, కన్నడ, తమిళ సినిమాల్లో నటించారు సరోజాదేవి.
1938లో కర్ణాటకలో జన్మించిన ఆమే 13 ఏళ్ల వయసులోనే సినీ రంగంలోకి అడుగుపెట్టారు. 1955లో ‘మహాకవి కాళిదాస’ అనే కన్నడ సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు సరోజాదేవి. ‘పెళ్లిసందడి’ (1959)లో తెలుగు చిత్రసీమలో పరిచయమయ్యారు. అంతకంటే ముందు పాండురంగ మహత్యం, భూకైలాస్ ముందుగా విడుదలై ఆమెకు నటిగా గుర్తింపునిచ్చాయి.
సీతారామ కల్యాణం (1961), జగదేకవీరుని కథ (1961), శ్రీకష్ణార్జున యుద్ధం (1963), దాగుడు మూతలు (1964), ఆత్మబలం (1964), శకుంతల (1966), దానవీర శూర కర్ణ (1978), అల్లుడు దిద్దిన కాపురం (1991) వంటి పలు తెలుగు సినిమాల్లో నటించారు.
దాదాపు 200కు పైగా సినిమాల్లో నటించారు సరోజా దేవి. సినీ రంగానికి ఆమె చేసిన సేవలకు గాను ప్రభుత్వం ఆమెను 1969లో పద్మశ్రీతో, 1992లో పద్మభూషణ్ పురస్కారాలతో సత్కరించింది. సరోజాదేవి మరణంపట్ల తెలుగు, కన్నడ, తమిళ సినీ రంగాలకు చెందిన ప్రముఖులు నివాళి అర్పిస్తున్నారు.










