- సికింద్రాబాద్ – తిరుపతి – సికింద్రాబాద్ వందే భారత్ రైల్ లో సీట్ల సంఖ్య రెట్టింపు
- 16 కోచ్లతో మే 17 నుండి వేగవంతమైన ప్రయాణం
- రైలులో సీట్ల సామర్థ్యం 530 నుండి 1128కి పెంపుదల
- 15 నిమిషాలు తగ్గిన ప్రయాణ సమయం
Secunderabad – Tirupati Vande Bharat Train | కేంద్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన వందేభారత్ ఎక్స్ ప్రెస్ రైళ్లను తెలుగు రాష్ట్రాలకు కూడా కేటాయించిన విషయం తెలిసిందే.
మొదట సికింద్రాబాద్ - విశాఖపట్నం మధ్య వందేభారత్ రైలును ప్రారంభించారు. ఇటీవల ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఏప్రిల్ 8న సికింద్రాబాద్ – తిరుపతి – సికింద్రాబాద్ వందే భారత్ రైలును కూడా జెండా ఊపి ప్రారంభించారు.
అయితే తాజాగా ఈ రైలుకు సంబంధించి కీలక మార్పులు చేపట్టారు. ఇకనుంచి మరింత మంది ప్రయాణీకుల సామర్థ్యంతో వేగంగా ప్రయాణించనుంది సికింద్రాబాద్-తిరుపతి వందేభారత్ ఎక్స్ ప్రెస్.
ఇప్పటి వరకు 8 కోచ్లు, 530 మంది ప్రయాణీకుల సామర్థ్యంతో ప్రయాణించే రైలు 16 కోచ్లు మరియు 1,128 సీట్ల సామర్థ్యంతో మే 17 నుండి సేవలను అందించబోతుంది.
దీనివల్ల, రెండు దిశలలో ప్రయాణ సమయం కూడా 15 నిమిషాలు తగ్గుతోంది. ఈ రైలు ప్రస్తుతం ఉన్న 8 ½ గంటల వ్యవధికి పడుతోంది. ప్రస్తుతం 8 గంటల 15 నిమిషాలలో ప్రయాణాన్ని పూర్తి చేయనుంది.
రైలు నం. 20701/02 సికింద్రాబాద్ – తిరుపతి – సికింద్రాబాద్ వందే భారత్ ఎక్స్ప్రెస్ ప్రారంభంలో 8 కోచ్ల తో ప్రవేశపెట్టారు. ఇందులో 01 ఎగ్జిక్యూటివ్ క్లాస్ మరియు 07 చైర్ కార్లు ఉన్నాయి.

సాధారణ సేవలను ప్రవేశపెట్టినప్పటి నుంచి, రైలు స్థిరంగా 100% కంటే ఎక్కువ సామర్థ్యంతో ప్రయాణికుల ప్రోత్సాహంతో నడుస్తోంది.
రైలు నంబర్ 20701 సికింద్రాబాద్ – తిరుపతి వందే భారత్ ఎక్స్ ప్రెస్ ఏప్రిల్లో 131%, మే 2023లో 135%, రైలు నంబర్ 20702 తిరుపతి – సికింద్రాబాద్ వందే భారత్ ఎక్స్ ప్రెస్ ఏప్రిల్లో 136%, మే 2023లో 138% మేర ప్రయాణికుల నుండి విశేషమైన స్పందనను నమోదు చేసినట్లు రైల్వేశాఖ వెల్లడించింది.
రైలు మే 17 నుండి ప్రస్తుత 8 కోచ్ ల కెపాసిటీకి బదులుగా 16 కోచ్ ల సామర్థ్యంతో నడుస్తుంది. కొత్త కంపోజిషన్లో 1,024 కెపాసిటీతో 14 చైర్ కార్లు ఉంటాయి.