KTR assures full support to Padma Shri awardee Darshanam Mogulaiah | తెలంగాణ జానపద సంగీతకారుడు, పద్మశ్రీ దర్శనం మొగులయ్యకు బీఆరెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ భరోసా ఇచ్చారు. మొగులయ్యకు చెందిన ఇంటి స్థలం సమస్య పరిష్కారం, కంటి చికిత్స బాధ్యతను కేటీఆర్ తీసుకున్నారు.
శనివారం కేటీఆర్ ను మొగులయ్య కలిశారు. మొగులయ్య ఆరోగ్యం, యోగక్షేమాల గురించి కేటీఆర్ ఆరా తీశారు. ఈ సందర్భంగా మొగులయ్య తన కంటిచూపు మందగించిందని, చికిత్స కోసం ఇబ్బందులు పడుతున్న విషయాన్ని కేటీఆర్ దృష్టికి తీసుకువచ్చారు. వెంటనే స్పందించిన కేటీఆర్, హైదరాబాద్లోని ఎల్వీ ప్రసాద్ ఐ హాస్పిటల్లో పూర్తి చికిత్సను అందించే బాధ్యతను తాను తీసుకుంటానని హామీ ఇచ్చారు.
అనంతరం మొగులయ్య, గత ప్రభుత్వం తనకు హయత్ నగర్ మండలంలో కేటాయించిన 600 గజాల స్థలం విషయంలో కొంతమంది వ్యక్తుల నుండి ఎదురవుతున్న ఇబ్బందులు, కోర్టు కేసుల వివరాలను కేటీఆర్కు వివరించారు. దింతో కేటీఆర్ రంగారెడ్డి జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డికి ఫోన్ చేసి మాట్లాడారు. సమస్యను వెంటనే పరిష్కరించి, న్యాయం చేయాలని కోరారు.









