Chiranjeevi Requests CM Chandrababu | తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన ‘గద్దర్ సినీ పురస్కారాల’ వేడుక ఆంధ్రప్రదేశ్ రాజకీయ, సినీ వర్గాల్లో కొత్త చర్చకు దారితీసింది.
గద్దర్ పేరిట అవార్డులను పునరుద్ధరించి కళాకారులను గౌరవిస్తున్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని అభినందిస్తూనే, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుకు సినీ ప్రముఖులు కీలక విజ్ఞప్తి చేశారు.
కళాకారులను గౌరవించే రాష్ట్రమే సుభిక్షం..
ఈ వేడుకలో ‘ఎన్టీఆర్ నేషనల్ అవార్డు’ అందుకున్న మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ.. ఏపీ ప్రభుత్వంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
“కళాకారులను ప్రోత్సహించడంలో మరో తెలుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ కాస్త వెనుకబడి ఉందనేది నా అభిప్రాయం. కళాకారులకు ఎక్కడ గౌరవం దక్కుతుందో ఆ రాష్ట్రం సుభిక్షంగా ఉంటుంది” అని పేర్కొన్నారు.
సినీ పరిశ్రమకు అత్యంత సన్నిహితుడైన చంద్రబాబు గారు, ఈ గద్దర్ అవార్డుల నిర్వహణను స్ఫూర్తిగా తీసుకుని ఏపీలోనూ అవార్డుల ప్రదానాన్ని పునఃప్రారంభించాలని కోరారు.
తద్వారా యువతరం మరిన్ని మంచి సినిమాలు తీసే అవకాశం ఉంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
13 ఏళ్ల నిరీక్షణకు తెర దించండి: ఆర్. నారాయణమూర్తి
పీపుల్స్ స్టార్. ఆర్. నారాయణమూర్తి తనదైన శైలిలో భావోద్వేగంగా స్పందించారు. “గత 13 ఏళ్లుగా నంది అవార్డుల కోసం ఎదురుచూస్తున్నాం.
రేవంత్ రెడ్డి గారు ధైర్యంగా గద్దర్ పేరిట అవార్డులు ఇస్తూ దూసుకుపోతున్నారు. చంద్రబాబు గారు.. మీకు దండం పెడతాం, దయచేసి ఏపీలో నంది అవార్డులను ప్రకటించండి” అని విజ్ఞప్తి చేశారు.
తెలుగు సినీ పరిశ్రమ ఉనికిని కాపాడాలని ఆయన కోరారు.
ఏపీ ప్రభుత్వం స్పందన?
గత కొన్నేళ్లుగా నిలిచిపోయిన ఈ పురస్కారాల అంశంపై ఇప్పటికే ఏపీ సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ స్పందించారు.
నంది అవార్డులు, నంది నాటకోత్సవాల పునరుద్ధరణపై కసరత్తు జరుగుతోందని, త్వరలోనే తేదీలను ప్రకటిస్తామని గత నెలలోనే అధికారులకు ఆదేశాలిచ్చారు.
అయితే, చిరంజీవి వంటి అగ్రనటుల విజ్ఞప్తితో ఈ ప్రక్రియ మరింత వేగవంతమయ్యే అవకాశం కనిపిస్తోంది.






